
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలను గావించారు.
పర్ణశాల హుండీ లెక్కింపు
దుమ్ముగూడెం: పర్ణశాల శ్రీ సీతారామ ఆలయ దేవస్థానంలో శుక్రవారం హుండీ కానుకలు లెక్కించారు. నెల రోజులకు గాను రూ. 7,35,728 ఆదాయం సమకూరిందని ఈఓ రమాదేవి తెలిపారు. చివరిసారిగా గత నెల 7న ఆలయ హుండీ కానుకలు లెక్కించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ భవాని రామకృష్ణ, వెంకటేశ్వరరావు, అనిల్ కుమార్, స్వచ్ఛంద సంస్థ సేవకులు, స్టేట్బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజ, కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, అర్చకులు పాల్గొన్నారు.
లాసెట్ ప్రశాంతం
సుజాతనగర్: న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ లాసెట్ పరీక్ష అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. మూడు షిఫ్ట్లలో పరీక్ష నిర్వహించగా, మొదటి షిఫ్ట్లో 103, రెండో షిఫ్ట్లో 112, మూడో షిఫ్ట్లో 109మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
● ఎస్పీ రోహిత్రాజు
సూపర్బజార్(కొత్తగూడెం): పరస్పరం మతాలను గౌరవించుకుంటూ శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని ఎస్పీ రోహిత్రాజు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే బక్రీద్ పర్వదినం కోసం అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మున్సిపల్, వెటర్నటీ, విద్యుత్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ముస్లింలు భారీ సంఖ్యలో హాజరయ్యే సామూహిక ప్రార్థనా సమయాల్లో ముందస్తు జాగ్రత్తగా ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు, పర్యవేక్షణ, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. పాడి ఆవులను, లేగ దూడలను విక్రయించొద్దని సూచించారు.

స్వర్ణ కవచధారణలో రామయ్య

స్వర్ణ కవచధారణలో రామయ్య