ప్రణాళిక కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళిక కావాలి

Jun 7 2025 12:16 AM | Updated on Jun 7 2025 12:16 AM

ప్రణాళిక కావాలి

ప్రణాళిక కావాలి

పద్దులో

పెట్టారు..

బడ్జెట్‌లో ప్రత్యేక పద్దు

కొత్తగూడెం – పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్‌ మండల పరిధిలో ఏడు గ్రామపంచాయితీలను ఏకం చేస్తూ కొత్తగూడెం కార్పొరేషన్‌ ఏర్పాటు బిల్లును గత మార్చిలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. ఆ సమావేశాల్లోనే కొత్తగా కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్‌ అయిన మంచిర్యాల, మహబూబ్‌నగర్‌లతోపాటు కొత్తగూడెం నగరాభివృద్ధితోపాటు వివిధ పద్దుల కింద రమారమీ రూ.1,000 కోట్ల నిధుల కేటాయించారు. అయితే శాసనసభ, తర్వాత శాసన మండలి, అనంతరం గవర్నర్‌ ఆమోదం పొంది కార్పొరేషన్‌ గెజిట్‌ విడుదలయ్యే సరికి దాదాపు మూడు నెలల సమయం పట్టింది. మరోవైపు బడ్జెట్‌ అమల్లోకి వచ్చాక తొలి త్రైమాసికం పూర్తి కావొస్తుంది. రెండో త్రైమాసికం నాటికై నా కొత్తగూడెం నగర పాలిక అభివృద్ధి ప్రణాళిక సిద్ధమైతే ఆ తర్వాత దశల్లో పనులను పట్టాలెక్కించేందుకు ఆస్కారం ఉంటుంది. లేదంటే బడ్జెట్‌ కేటాయింపు ఫలాలు పూర్తి స్థాయిలో దక్కేది సందేహాస్పదం అవుతుంది.

ప్రతిపాదనలు సిద్ధం

డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ నుంచి ఇప్పటికే పాల్వంచ , కొత్తగూడెం మున్సిపాలిటీలకు వేర్వేరుగా రూ. 40 కోట్లు మంజూరయ్యాయి. వీటితో పాటు ఈ రెండు పట్టణాల్లో వివిధ అభివృద్ధి పనులకు స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కోసం ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పుడు రెండు పట్టణాలు, సుజాతనగర్‌లు కలిసి నగర పాలికగా మారినందున మూడు ప్రాంతాల ఉమ్మడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా ప్రతిపాదనలు రూపొందించాల్సిన అవసరం ఉంది. కొత్తగూడెం–పాల్వంచ పట్టణాల ఉమ్మడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ. 450 కోట్లతో కొత్తగూడెం రింగ్‌రోడ్డు కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ పనులు త్వరితగతిన పట్టాలెక్కేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. చాన్నాళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఖమ్మం – తిరువూరు – పాల్వంచ రోడ్లను కలిపే బైపాస్‌ రోడ్డుకు సంబంధించి రామవరం దగ్గర గోధుమ వాగుపై వంతెన నిర్మాణ పనులపైనా దృష్టి పెట్టాల్సి ఉంది. రూ. 124 కోట్లతో చేపట్టిన అమృత్‌ తాగునీటి పథకం పనుల్లో వేగం పెంచడం, అసంపూర్తిగా మిగి లిన సుజాతనగర్‌ దగ్గర సింగభూపాలెం, పాల్వంచ పట్టణంలో చింతల చెరువు సుందరీకరణ పనులు చక్కబెట్టాల్సి ఉంది. వీటితో ప్రగతి మైదాన్‌లో ఇండోర్‌ స్టేడియం, కార్పొరేషన్‌ ఫంక్షన్‌ హాళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

అథారిటీ కూడా వస్తే..

నగరపాలిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కొత్తగూడెం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు పాలక మండలిని ప్రకటించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో నిధులు సమీకరించి వివిధ అభివృద్ధి పనులు చేపట్టాల్సిన బాధ్యత కుడాపై ఉంటుంది. నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆటోనగర్‌, ఐటీ హబ్‌, ఇండస్ట్రియల్‌ పార్క్‌, ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ పునర్‌ నిర్మాణం, జూపార్క్‌లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కార్పొరేషన్‌, కుడాల ఆధ్వర్యంలో ఈ పనులపై ఫోకస్‌ చేయాలి.

రాష్ట్ర బడ్జెట్‌లో కొత్తగూడెం

కార్పొరేషన్‌కు నిధులు

పూర్తి కావొస్తున్న తొలి త్రైమాసికం..

ఇటీవల గెజిట్‌ విడుదల

అభివృద్ధి ప్రణాళికతో పద్దులో

నిధులు వినియోగించుకునే అవకాశం

కమిషనర్‌గా ఐఏఎస్‌

అధికారి కావాలంటున్న ప్రజలు

కార్పొరేషన్‌గా పేర్కొంటూ బోర్డుల ఏర్పాటు, డివిజన్ల పునర్విభజనపైనే అధికారులు దృష్టి సారించారు. దీంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌లో కొత్తగూడెం కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను నగర అభివృద్ధికి ఉపయోగించేందుకు వీలుగా త్వరితగతిన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరముంది.

–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

ఐఏఎస్‌ను నియమిస్తే మేలు

సాధారణంగా కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లకు కనీసం గ్రేడ్‌–1 లేదా స్పెషల్‌ గ్రేడ్‌ ఆఫీసర్లను కమిషనర్లుగా నియమించాల్సి ఉంది. లేదంటే అడిషనల్‌ కలెక్టర్‌, ఆపై స్థాయి అధికారులు కమిషనర్లుగా రావాల్సి ఉంది. కమిషనర్‌ హోదాలో ఉన్న అధికారే (కొత్తగూడెం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)కుడాకు వైస్‌ చైర్మన్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రేడ్‌–2 ఆఫీసర్‌గా ఉన్న సుజాతను కొత్తగూడెం కార్పొరేషన్‌కు కమిషనర్‌గా నియమించడం పట్ల నగర ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మారిన రూపురేఖలు, పెరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించడం, అవి వేగంగా అమలయ్యేలా వివిధ విభాగాలను సమన్వయం చేయాల్సి ఉంటుంది. దీంతో ఐఏఎస్‌ లేదా గ్రూప్‌ వన్‌ అధికారులకు కొత్తగూడెం నగర పాలనబాధ్యతలు అప్పగించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement