
ఆదాయం అంతంతే..
● జిల్లాలో జోరుగా జీరో దందా ● మార్కెటింగ్ శాఖ ఆదాయానికి గండి ● పటిష్ట చర్యలు చేపట్టని అధికారులు
ఇల్లెందు: జిల్లాలో ఆరు వ్యవసాయ మార్కెట్లు ఉన్నా జీరో దందా జోరుగా సాగుతోంది. అనుమతులున్న వ్యాపారులు కూడా క్రయవిక్రయాలను రిజిస్టర్లలో నమోదు చేయకుండా మార్కెట్ ఫీజుకు ఎగనామం పెడుతున్నారు. రైతుల పేరుతో రశీదులు సృష్టించి దర్జాగా ఎగుమతులు చేస్తున్నారు. పంట పండినట్లు వ్యవసాయశాఖ, భూమి ఉన్నట్లు రెవెన్యూ శాఖ రశీదులు ఇస్తున్నాయి. ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో మార్కెట్ ఆదాయానికి గండిపడుతోంది. జీరో దందాకు చెక్ పెడితే మార్కెట్ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఇందుకోసం చెక్ పోస్టులు పటిష్టం, నిరంతర తనిఖీలు, క్రయవిక్రయాల ఆన్లైన్, సీసీ కెమెరాలు ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
చెక్ పోస్టులతోనే ఆదాయం..
జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్లలోనూ ఏడాది పొడవున క్రయవిక్రయాలు సాగడంలేదు. కేవలం సీజనల్గా మాత్రమే వ్యాపారం జరుగుతోంది. దీంతో ఆదాయం కోసం చెక్ పోస్టులపైనే ఆధార పడాల్సివస్తోంది. జిల్లాలో కొత్తగూడెం, దమ్మపేట, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, ఇల్లెందు మార్కెట్యార్డులు ఉండగా, 2025–26 సంవత్సరానికి రూ. 22.65 కోట్లుగా లక్ష్యం నిర్దేశించారు. గతేడాది లక్ష్యం రూ.21.69 కోట్లు కాగా, ఈ ఏడాది రూ. కోటి అదనంగా లక్ష్యం పెంచారు.
ఉపయోగపడని గోదాంలు
క్రయవిక్రయాలు లేక మార్కెట్ యార్డుల్లో ధర్మ కాంటాలు ఖాళీగానే ఉంటున్నాయి. ఇక్కడి గోదాంలను సివిల్ సప్లై, పీఏసీఎస్, మార్కెఫెడ్లకు స్టాక్ పాయింట్లుగా మారుతున్నాయి. సరైన ధర లభించనప్పుడు రైతులు పంటలు నిల్వ చేసుకునేందుకు మార్కెట్లలో నిర్మించిన గోదాంలు ఇతర శాఖలకు ఉపయోగపడుతున్నాయి. ఇక రూ. కోట్లలో వ్యాపారం చేసే వ్యాపారులు మార్కెట్కు రాకపోగా, అధికారులే వారి ఇళ్లకు వెళ్లి ధాన్యం తోలకం పర్మిట్లను ఇస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మార్కెటింగ్ అధికారులు ఇప్పటికై నా దృష్టి సారించి ఆదాయం పెంచే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లక్ష్యం సాధిస్తాం
ఈ ఏడాది జిల్లాలో మార్కెట్ ఆదాయం లక్ష్యం సాధించే దిఽశగా చర్యలు చేపట్టాం. మార్కెట్ల పరిధిలో చెక్ పోస్టులను పటిష్టం చేసి వ్యాపారుల నుంచి మార్కెట్ ఫీజు వసూలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
–జె.నరేందర్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి