
ఆదివాసీలకు అండగా ఉంటాం
చర్ల: ఇంతకాలం మావోయిస్టుల చేతిలో నలిగిపోయి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఆదివాసీలకు అండగా ఉంటామని ఎస్పీ రోహిత్రాజు హామీ ఇచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులతో మండలంలోని 20 గ్రామాల్లో ఏర్పాటు చేసిన మినీ మల్టీపర్పస్ మిల్లులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న మావోయిస్టులు వారికి తీవ్ర నష్టం కలిగించారని, విద్య, వైద్యం, రహదారులు, కమ్యూనికేషన్ వంటి సౌకర్యాలు అందకుండా అభివృద్ధికి దూరంగా ఉంచారని అన్నారు. ఇంతకాలం తర్వాత అయినా మావోయిస్టుల ఆగడాలను వ్యతిరేకిస్తూ ఆదివాసీలు అబివృద్ధిని కోరుకోవడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలని, ఇప్పటివరకు చదువుకుని ఖాళీగా ఉంటున్న యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉపాధి అవకాశాలను చూసుకోవాలని సూచించారు. తమ శాఖ ద్వారా కూడా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే విప్ప నూనె తీసే మిల్లులను కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, అన్ని గ్రామాలకు రహదారులు, విద్య, వైద్యం వంటి సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడతామని తెలిపారు. ఇకపై ఎవరూ మావోయిస్టులకు సహకరించొద్దని కోరారు. ఆయా కార్యక్రమాల్లో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, ఓఎస్డీ జి.నరేందర్, చర్ల సీఐ రాజువర్మ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్రాజు భరోసా
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు..
భద్రాచలంఅర్బన్ : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. బుధవారం ఆయన ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్తో కలిసి పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల సత్వర పరిష్కారినికి కృషి చేయాలన్నారు. అనంతరం స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ నరేందర్, టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐలు స్వప్న, రామకృష్ణ, శ్యామ్ప్రసాద్ పాల్గొన్నారు.