
బడిగంట మోగింది..
కొత్తగూడెంఅర్బన్ : వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల ఆవరణలు, తరగతి గదులను స్వచ్ఛ కార్మికులతో శుభ్రం చేయించారు. ఇందుకోసం వారికి జిల్లా స్థాయిలో రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు పాఠశాలకు రాగానే పండుగ వాతావరణం కనిపించేలా మామిడి తోరణాలు, రంగు కాగితాలతో అలంకరించాలని ఇప్పటికే డీఈఓ వెంకటేశ్వరాచారి ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే బుధవారం సాయంత్రం వరకూ కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఏ ప్రభుత్వ పాఠశాలలోనూ అలాంటి హడావిడి కనిపించలేదు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం అడ్మిషన్ల కోసం ప్రతీ సంవత్సరం చేసే హడావిడి ఈ ఏడాది కూడా కనిపించింది.
కొన్ని స్కూళ్లు శిథిల భవనాల్లోనే..
పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు నూతన భవనాలు నిర్మించినా.. కొన్ని స్కూళ్లు మాత్రం ఇంకా శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ల్లోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం అయినందున అలాంటి స్కూళ్లకు తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. కొత్తగూడెం పట్టణంలోని కూలీలైన్ ప్రభుత్వ పాఠశాల ఎప్పడో తరాల నాటిది. తరగతి గదులు, ఆఫీసు రూములన్నీ శిథిలావస్థకు చేరి ఉన్నాయి. పాఠశాల చరిత్ర గొప్పగా ఉన్నప్పటీకి సౌకర్యాలు లేకపోవడంతో అడ్మిషన్ల సంఖ్య ప్రతీ ఏడాది తగ్గిపోతోంది. ఈ సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత పాఠశాలల కమిటీలపై ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక చాలా పాఠశాలల్లో వంట షెడ్లు లేకపోవడంతో ఆవరణలోని చెట్ల కింద, నీడ ఉన్న చోటే మధ్యాహ్న భోజనం వండుతున్నారు. ఇలా ఎండా, వానలకు భోజన కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలనే లక్ష్యంతో బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు.. ఇలాంటి సమస్యలు కూడా పరిష్కరిస్తే ఎక్కువ మంది పిల్లలు చేరే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
పండుగ వాతావరణంలో
ప్రారంభించాలి
పాఠశాలలను పండుగ వాతావరణంలో పునఃప్రారంభించాలి. విద్యార్థులు బడికి రాగానే ఆహ్లాదం కలిగేలా ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది ఏర్పాట్లు చేయాలి. మొదటి రోజే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందజేస్తున్నాం. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– వెంకటేశ్వరాచారి, డీఈఓ
నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం
స్కూళ్లకు చేరిన పుస్తకాలు, యూనిఫామ్
ఏర్పాట్లు సిద్ధం చేసిన ఉపాధ్యాయులు
పండుగ వాతావరణంలో ప్రారంభించాలని ఆదేశాలు

బడిగంట మోగింది..