
బడి.. జ్ఞాపకాల ఒడి
అన్నయ్య ప్రోత్సాహంతోనే..
కొత్తగూడెం అర్బన్: పాఠశాలలో చేర్పించడానికి మా నాన్న తీసుకెళ్తే పారిపోయా. ఈ విషయం తెలిసి మా అన్నయ్య నన్ను వెదికి పట్టుకుని బడిలో అడ్మిషన్ ఇప్పించడమే కాక ప్రతిరోజూ వెళ్లేలా చూసేవాడు. అన్నయ్య ప్రోత్సాహంతోనే చదువుకుని ఈ స్థాయికి చేరా. నల్లగొండ టౌన్లోని ప్రభుత్వ పాఠశాలలో చదవగా, ఆతర్వాత ఎంఏ పూర్తి చేశా. విద్యాశాఖలో ఉద్యోగం సాధించి డీఈఓ స్థాయికి చేరడంతో విద్యారంగంలో జిల్లాను ముందుంచేలా కృషి చేస్తున్నా. విద్యార్థులు నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఇష్టంతో చదువుతూ లక్ష్యాన్ని ఎంచుకుని దాని సాధనకు కృషి చేయాలి.
– ఎం.వెంకటేశ్వరాచారి,
జిల్లా విద్యాశాఖాధికారి
బడంటే సంతోషం.. హాస్టలంటే భయం
బూర్గంపాడు: పాఠశాల ప్రారంభం రోజే మళ్లీ సెలవులు ఎప్పుడొస్తాయనే లెక్కలు వేసుకుంటూ వెళ్లేవాళ్లం. నెలన్నర రోజుల వేసవి సెలవుల తర్వాత పాఠశాలకు వెళ్లడం సంతోషంగానే ఉండేది. కానీ అప్పట్లో హాస్టల్లో అన్నంలో పురుగులు, నీళ్ల చారు తలుచుకుంటేనే ఏడుపొచ్చేది. ఆ రోజుల్లో ఉపాధ్యాయులు పాఠాలు చక్కగా చెప్పేవారు. సరిగా చదవకుంటే తన్నులు తప్పేవి కావు. ఎర్రుపాలెం మండలం కేసిరెడ్డిపల్లిలో నాలుగో తరగతి వరకు, ఆ తర్వాత హాస్టల్లో ఉంటూ ఎర్రుపాలెం జెడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి వరకు చదివా. ఇప్పుడు విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలి.
– వేల్పుల బాబూరావు,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
●
ఆవాసాలకు దూరంగా ప్రభుత్వ పాఠశాలలు.. అక్కడ కూడా అరకొర వసతులు.. ప్రైవేట్ పాఠశాలలు అందుబాటులో ఉన్నా అందులో చదివే స్థోమత లేక ఇబ్బందులు.. ఈ సమస్యలు వేధిస్తున్నా.. చదవాలనే తపనకు తోడు గురువుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరిన వారెందరో ఉన్నారు. నేడు కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లాలో పలువురు ప్రముఖులను పలకరించగా.. వారి పాఠశాల జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ వివరాలు ‘సాక్షి’ పాఠకుల కోసం..

బడి.. జ్ఞాపకాల ఒడి

బడి.. జ్ఞాపకాల ఒడి