చుంచుపల్లి: ఐడీఓసీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం జరుగనున్న దిశ కమిటీ సమావేశం అనివార్య కారణాలతో వాయిదా పడిందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దిశ కమిటీ సభ్యులు, అన్ని శాఖల జిల్లా అధికారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
పంటల సాగుపై అవగాహన ఉండాలి
కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణమ్మ
సూపర్బజార్(కొత్తగూడెం): తాము చేసే సాగుపై రైతులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ అన్నారు. చిట్టి రామవరంలో బుధవారం నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అవసరం మేరకే రసాయనిక ఎరువులు వాడాలని, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పక రశీదు తీసుకుని భద్రపర్చాలని సూచించారు. పచ్చిరొట్ట పంటలు సాగుచేయడం ద్వారా 30 శాతం వరకు నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పారు. పంటల మార్పిడితో సుస్థిర ఆదాయం పొందొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఈఏసీ సభ్యుడు యాదగిరి, ఉద్యాన శాస్త్రవేత్త బి శివ, మండల వ్యవసాయాధికారి కరుణ, విస్తరణాధికారి అనూష తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పాదయాత్ర
ములకలపల్లి : అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలోని సర్వే నంబర్లు 30, 36, 39లో గల భూములను తమకే అప్పగించాలని కోరుతూ స్థానిక ఆదివాసీలు కలెక్టరేట్ వరకు చేపట్టిన పాదయాత్ర బుధవారం ములకలపల్లికి చేరింది. మంగళవారం వారు అశ్వారావుపేట నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తంగా 70 కిలోమీటర్ల మేర నడుస్తూ బుధవారం రాత్రికి పాల్వంచ శ్రీనివాస కాలనీలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని అక్కడే బస చేశారు. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని కలెక్టర్ కార్యాలయానికి గురువారం చేరుకుని కలెక్టర్కు వినతిపత్రం అందిస్తామని ఆదివాసీలు మడకం నాగేశ్వరరావు, మడకం స్వరూప, మొడియం రమాదేవి, కొర్సా శ్రీను, కొర్సా నాగబాబు, మాడి సీతారాముడు, మడకం కన్నారావు తదితరులు తెలిపారు.