
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
అదనపు కలెక్టర్ వేణుగోపాల్
చుంచుపల్లి/చండ్రుగొండ : భూ సమస్యలు పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం గ్రామగ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని, రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. చుంచుపల్లి మండలం ఎన్కే నగర్, చండ్రుగొండ మండలం తిప్పనపల్లి, వెంకటియాతండా గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని, ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఒకటి, రెండు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతులు, ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్లు కృష్ణ, సంధ్యారాణి, డిప్యూటీ తహసీల్దార్ ప్రసన్న, కార్యదర్శి ఇందిర తదితరులు పాల్గొన్నారు.