రాత పరీక్ష ఎప్పుడో..? | - | Sakshi
Sakshi News home page

రాత పరీక్ష ఎప్పుడో..?

Jun 9 2025 7:05 AM | Updated on Jun 9 2025 7:05 AM

రాత పరీక్ష ఎప్పుడో..?

రాత పరీక్ష ఎప్పుడో..?

● సింగరేణిలో మార్చి 2024లో ఇంటర్నల్‌ నోటిఫికేషన్‌ ● పరీక్ష కోసం 15 నెలలుగా ఎదురుచూస్తున్న కార్మికులు

సింగరేణి(కొత్తగూడెం): నోటిఫికేషన్‌ విడుదల చేసి 15 నెలలు గడిచినా సింగరేణిలో ఇంటర్నల్‌ క్లరికల్‌ రాత పరీక్ష నిర్వహించడంలేదు. 360 క్లరికల్‌ పోస్టుల భర్తీకి సింగరేణి యాజమాన్యం 2024 మార్చిలో ఇంటర్నల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో సంస్థవ్యాప్తంగా 7 వేల మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. 15 నెలలైనా పరీక్ష నిర్వహించకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశ చెందుతున్నారు. నోటిఫికేషన్‌ ఇచ్చే నాటికి 360 పోస్టులు ఉండగా, ప్రతి నెలా కొందరు కార్మికులు ఉద్యోగ విరమణ పొందుతుండటంతో ఖాళీల సంఖ్య ఇంకా పెరిగిందని, ప్రస్తుతం సుమారు 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇటీవల డిపెండెంట్‌ ఉద్యోగాలకు ఎక్కువ మంది విద్యావంతులు ఎంపికయ్యారు. నిబంధనల ప్రకారం వారిని బదిలీ వర్కర్‌గా నియమించిన యాజమాన్యం.. వారితో క్లరికల్‌ విధులు నిర్వహింపజేస్తోంది. బదిలీ వర్కర్‌ వేతనం పొందుతూ క్లరికల్‌ పనులు చేయాల్సివస్తోందని వారు వాపోతున్నారు.

ఎక్స్‌టర్నల్‌ నోటిఫికేషన్లు ఏవీ..?

2024 సంస్థ 327 క్లరికల్‌ పోస్టుల భర్తీకి ఎక్స్‌టర్నల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ తర్వాత మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. సింగరేణి సీఎండీగా ఎన్‌.బలరామ్‌ బాధ్యతలు చేపట్టాక ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. ఏడాది గడిచినా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. ఇచ్చినా నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్షా నిర్వహించలేదు. ఇక రిక్రూట్‌మెంట్‌ సెల్‌ జీఓం పోస్టులో ఇటీవల కాలంలో ముగ్గురు అధికారులు మారారు. ఈ పోస్టులో ఏ ఒక్క అధికారి పూర్తిస్థాయిలో పనిచేయని కారణంగా నోటిఫికేషన్లు జాప్యమవుతున్నాయని కార్మిక నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా సింగరేణి ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే 2024 మార్చి నోటిఫికేషన్‌ రాత పరీక్ష నిర్వహించాలని, ఖాళీల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement