
వినియోగదారులు చేజారకుండా..
● నాణ్యమైన బొగ్గు సరఫరాకు సింగరేణి యాజమాన్యం చర్యలు ● హై గ్రేడ్, లో గ్రేడ్ కలిపి జి–13 బొగ్గు రవాణాకు నిర్ణయం ● ఏరియాల జీఎంలకు ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్లు
సింగరేణి(కొత్తగూడెం): ిసంగరేణి ఉత్పత్తి చేస్తున్న జి–15 గ్రేడ్ బొగ్గు స్వీకరణకు థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిరాకరిస్తున్నాయి. ఫలితంగా రోజుకు 8 రేకుల(సుమారు 32 వేల టన్నుల) బొగ్గు నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో ప్రతీ రోజు 42 రేకులకు బదులు 34 రేకులే రవాణా అవుతున్నాయి. మరోవైపు నిల్వ ఉన్న బొగ్గు కోల్బెల్ట్ ప్రాంతంలో ఉండే అధిక ఉష్ణోగ్రతలతో అంటుకుని దగ్ధమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సంస్థ ఉత్పతి చేస్తున్న జీ–10, జీ–11, జీ–13, జీ–14, జీ–15లతోపాటు మరికొన్ని గ్రేడ్లను కలిపి, జీ–13 గ్రేడ్గా మార్చి వినియోగదారులకు సరఫరా చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. కొంతనష్టం వచ్చినా వినియోగదారుడిని సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కంపెనీ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లోని సీహెచ్పీల్లో అన్ని గ్రేడ్లను కలిపి జీ–13 బొగ్గు సరఫరా చేయాలని జీఎంలకు ఆదేశాలు జారీ చేసింది.
కోల్వాషరీల ద్వారా 60శాతమే చేతికి..
సింగరేణి సంస్థ రోజుకు సుమారు 2.10 లక్షల టన్ను ల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. ఇందులో 80 శాతం థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రవాణా చేస్తుండగా, మిగిలిన 20శాతం మాత్రం విద్యుత్తేతర పరిశ్రమలకు రవాణా చేస్తోంది. 20 శాతం కొనుగోలు చేస్తున్న సంస్థలతో ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ 80శాతం కొనుగోలు చేస్తున్న పరిశ్రమలే కొర్రీలు పెడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కొన్ని ప్రైవేట్ సంస్థలు సింగరేణి కంటే నాణ్యమైన బొగ్గును తక్కువ ధరకే రవాణా చేస్తున్నాయి. దీంతో విద్యుత్ కంపెనీలు అటువైపు చూస్తున్నాయి. ఈ క్రమంలో వినియోగదారులనుకాపాడుకునేందుకు కంపెనీ జీ–13 బొగ్గును రవాణా చేయాల ని సింగరేణి నిర్ణయించింది. కోల్ వాషరీ ద్వారా నా ణ్యమైన బొగ్గు అందించే అవకాశం ఉన్నా.. వాషరీలో సుమారు 40 శాతం బొగ్గు వృథాగా పోతోంది. మిగి లిన 60 శాతం మాత్రమే చేతికి వస్తుంది. ఈ నేపథ్యంలో జీ–13రకం బొగ్గురవాణా తప్పనిసరైందని అధికా రులు పేర్కొంటున్నారు. రానున్న వర్షాకాలం విద్యుత్ వినియోగం తగ్గి బొగ్గుడిమాండ్ లేకపోయినా.. నాణ్య మైన బొగ్గు సరఫరా చేస్తే విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకునే అవకాశం ఉందని సింగరేణి అధికారులు భావిస్తున్నారు.