
సీహెచ్సీనా... డెంటల్ ఆస్పత్రా !
స్పెషలిస్టులు లేరు..
బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, గైనకాలజిస్ట్, అనస్తీషియన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ వంటి నిపుణులైన వైద్యులు ఉండాలి. కానీ ఇక్కడ కనీసం ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా లేరు. 30 పడకల ఈ ఆస్పత్రికి ఏ జబ్బు చేసిన వారొచ్చినా డెంటిస్ట్లే దిక్కు. అసలే అరకొర వసతులు.. దానికి తోడు వైద్యులు లేకపోవడంతో పేషెంట్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కేవలం జ్వరం, జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న వ్యాధులకే చికిత్స అందుతోంది.
కలెక్టర్ ఆదేశించినా..
కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇటీవల ఈ ఆస్పత్రిని తనిఖీ చేసి వైద్యులు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీహెచ్సీలో ప్రసవాలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. డెలివరీలు జరిగేలా చూడాలని ఆదేశించారు. అయితే ఇక్కడ గైనకాలజిస్ట్, అనస్తీషియన్ లేకపోవడంతో ప్రసవాలు చేయడం సాధ్యం కాదనే చర్చ సాగుతోంది. ఆపరేషన్ థియేటర్ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇటీవలే కొన్ని వసతులు సమకూర్చారు. గతంలో ఇక్కడున్న దంతవైద్య పరికరాలు, పడకలను ఇతర ఆస్పత్రులకు తరలించారనే ఆరోపణలున్నాయి. ఆక్సిజన్ ప్లాంట్ కూడా పని చేయడం లేదు. కలెక్టర్ తనిఖీ అనంతరం ఇక్కడున్న నలుగురు డెంటిస్ట్ల్లో ఒకరిని జూలూరుపాడుకు పంపించి ఆ స్థానంలో ఓ ఎంబీబీఎస్ను డిప్యూటేషన్పై నియమించారు. ఇక్కడ వసతులతో పాటు వైద్య నిపుణులను నియమిస్తే సేవలు మెరుగుపడే అవకాశాలున్నాయి. రూ 2.70 కోట్లతో నూతన భవనాలను నిర్మిస్తుండగా ఆరు నెలల్లో అవి అందుబాటులోకి రానున్నాయి. ఈ సీహెచ్సీకి బూర్గంపాడు, ములకలపల్లి మండలాలతో పాటు ఏపీలో విలీనమైన పలు గ్రామాలు, కుక్కునూరు మండలం నుంచి ఎక్కువగా వస్తుంటారు. ఇకనైనా అధికారులు స్పందించి వైద్య నిపుణులను నియమించి సేవలు మెరుగుపడేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
వైద్య సేవలు మెరుగుపరుస్తాం
బూర్గంపాడు సీహెచ్సీలో వైద్యసేవలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవలే ఓ ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చారు. మరికొందరు నిపుణులను కూడా నియమించేలా వైద్య విధాన పరిషత్ చర్యలు తీసుకుంటోంది. నూతన భవనాలు అందుబాటులోకి వచ్చేసరికి డాక్టర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ ముక్కంటేశ్వరరావు,
ఆస్పత్రి సూపరింటెండెంట్
నిత్యం 100 మందికి పైగా ఔట్ పేషెంట్లు, సుమారు 30 మంది ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతున్న బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వర్షాకాలం ప్రారంభమైతే పేషెంట్ల సంఖ్య రెట్టింపవుతుంది. వాస్తవానికి ఈ సీహెచ్సీలో 13 మంది డాక్టర్లు ఉండాలి. కానీ ఇక్కడ ఒక్కరు కూడా రెగ్యులర్ వైద్యులు లేరు. ఆస్పత్రి సూపరింటెండెంట్ పిల్లల వైద్య నిపుణులు కాగా, మిగితా నలుగురు డెంటిస్ట్లు. వీరంతా డిప్యూటేషన్పై ఇక్కడ పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. ఇక ‘నలుగురు డెంటిస్ట్లు ఉన్నారు.. ఇక్కడ దంత వైద్య సేవలు బాగా అందుతాయి’ అనుకుంటే పొరపాటే. ఈ ఆస్పత్రిలో అలాంటి చికిత్సలే లేకపోగా నిత్యం వచ్చే ఇన్, ఔట్ పేషెంట్లకు వీరే జనరల్ వైద్య సేవలు అందిస్తున్నారు.
– బూర్గంపాడు
2020లో అప్గ్రేడ్..
గతంలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధీనంలో ఉన్న బూర్గంపాడు సివిల్ ఆస్పత్రిని 2020లో వైద్య విధాన పరిషత్ పరిధిలోకి తీసుకొచ్చారు. 30 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేశారు. ఆ సమయంలో డిప్యుటేషన్పై గైనకాలజిస్ట్, అనస్తీషియన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ వైద్యులను నియమించారు. మూడు నెలలు తిరగకుండానే వీరంతా డిప్యుటేషన్ రద్దు చేయించుకున్నారు. అప్పటి నుంచి డెంటిస్ట్లతోనే నెట్టుకొస్తున్నారు. వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి వచ్చినా కనీసం ఎంబీబీఎస్ డాక్టర్ను కూడా నియమించ లేదనే విమర్శలున్నాయి. సీహెచ్సీగా ఆప్గ్రేడ్ అయ్యాక పేషెంట్లకు భోజన వసతి మాత్రం కల్పిస్తున్నారు. ఈ సీహెచ్సీలో 12 మంది స్టాఫ్ నర్సులకు గాను ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. 24 గంటలూ నిరంతర వైద్య సేవలు అందించాల్సి ఉండగా వైద్యుల కొరతతో సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి.