
ప్రశ్నించే కమ్యూనిస్టులపై కేంద్రం కక్ష కట్టింది..
● మోడీ నియంత పాలనకు ఆపరేషన్ కగారే నిదర్శనం ● నంబాల మృతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
పాల్వంచరూరల్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్షా నియంత పాలన సాగిస్తూ ప్రశ్నించే కమ్యూనిస్టులపై కక్షకట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని అన్నారు. మండల పరిధిలోని పాండురంగాపురంలో మంగళవారం నిర్వహించిన సీపీఐ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకు కేంద్రం ముందుకు రాకుంటే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలని కోరారు. ప్రజల హక్కులు, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని ఎన్కౌంటర్లు చేయడం సమంజసం కాదన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా పట్టించుకోకుండా ఉద్దేశ పూర్వకంగానే ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. మావోయిస్టులు కూడా తమ లైన్ మార్చుకోవాలని, ప్రజల మద్దతు లేకుండా ఎన్ని త్యాగాలు చేసినా వృథానేనని అన్నారు. 1952లో తాము కూడా అజ్ఞాతంలో ఉండి పోరాటాలు చేశామని, ఆ తర్వాత పంథా మార్చుకుని ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్నామని వివరించారు. కమ్యూనిస్టులంతా ఐక్యంగా ఉంటే ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఎర్రజెండా ఒక్కటే భరోసా అన్నారు. కాగా, తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయించాలని ఓటమి పాలైన కొందరు కుట్ర పన్నినా.. అంతిమంగా న్యాయమే గెలిచిందని వ్యాఖ్యానించారు. సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్పాషా, నాయకులు నిమ్మల రాంబాబు, అప్పారావు, నాగరాజు, ముత్యాల విశ్వనాధం, పూర్ణచందర్రావు, బండి నాగేశ్వరరావు, అడుసుమల్లి సాయిబాబా, ఉప్పుశెట్టి రాహుల్, పద్మజ, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.