
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
అశ్వాపురం/కరకగూడెం: భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్లు సత్వరమే సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండల పరిధిలోని మిట్టగూడెం గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సును శుక్రవారం ఆయన పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్క్లు, రిజిస్టర్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. దరఖాస్తుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం బైక్పై వెళ్లి మిట్టగూడెం గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డును సందర్శించారు. పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులకు బయోచార్పై అవగాహన కల్పించారు. గ్రామంలోని కొర్రమీను చేపల పెంపకం యూనిట్ను సందర్శించి, నిర్వాహకులు కొర్సా సోని, దుర్గారావు దంపతులను అభినందించారు. ఆ తర్వాత ఉపాధి హమీలో నిర్మించిన ఫామ్పాండ్ను పరిశీలించారు. అనంతరం కరకగూడెం మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాల ఆవరణలో జరుగుతున్న నవోదయ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సదస్సులో ప్రజలు ఇచ్చే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. అక్షర జ్ఞానంతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. జవహర్ నవోదయ విద్యాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. కరకగూడెం నుంచి తిరిగొస్తున్న క్రమంలో బంగారుగూడెంలో రహదారిపై ఆరబోసిన ఇప్పగింజలను కలెక్టర్ పరిశీలించారు. గిరిజన మహిళలతో ముచ్చటించారు. చిన్నారులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో డీఈఓ వెంకటేశ్వరాచారి, నాగరాజశేఖర్, తహసీల్దార్లు రాజారావు, వట్టం కాంతయ్య, ఎంఈఓ మంజుల, ఎంపీడీఓ ముత్యాలరావు, ఏపీఓ సీతారామయ్య, ఏపీఎం సత్యనారాయణ తదతరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి