భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివా రికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలో ని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు,కుంకుమ, గాజులు, హా రతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఆవిర్భావ వేడుకలకు ముఖ్యఅతిథిగా తుమ్మల
సూపర్బజార్(కొత్తగూడెం): జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదాన్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేషన్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మీ పార్టీ సంగతి చూసుకోండి
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఎంపీ బలరాం నాయక్
ఇల్లెందు: కాంగ్రెస్ మునిగిపోయే నావ వంటిదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించడం గర్హనీయమని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ పేర్కొన్నారు. తొలుత బీఆర్ఎస్లో ముసలం సంగతి చూసుకోవాలని ఆయన హితవు పలికారు. ఇల్లెందులోని టీపీసీసీ మాజీ సభ్యుడు ఎస్.కే.జానీ ఇంటికి శుక్రవారం వచ్చిన ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం అమలు చేయాలన్నా నిధుల కొరత వేధిస్తోందన్నారు. గత ప్రభుత్వం చేసి అప్పులు తీరుస్తూనే పథకాల అమలుకు శ్రమిస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో గౌస్, గోచికొండ శ్రీదేవి, సాంబమహేష్, సయ్యద్ ఆజం, శ్రీనివాసగౌడ్, లింగంపల్లి శ్రీనివాస్, సిరాజ్ పాల్గొన్నారు.
బీఏఎస్కు దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంఅర్బన్: 2025–26 విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్(బీఏఎస్) పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖాధికారి అనసూర్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో రెసిడెన్షియల్(హాస్టల్)లో 69 సీట్లు, 1వ తరగతిలో నాన్ రెసిడెన్షియల్ (డే స్కాలర్స్)లో 66 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. రుద్రంపూర్ సెయింట్ జోసఫ్ హైస్కూల్లో 22 సీట్లు, స్వర్ణభారతి హై స్కూల్లో 22, భద్రాచలం లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో 22, లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 69 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. జూన్ 16వ తేదీ లోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని, 20న లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామని వివరించారు.

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన