
అవసరాలు తెలుసుకునేందుకే..
పాల్వంచరూరల్/పాల్వంచ : గిరిజనుల అవసరాలు ఏంటో తెలుసుకుని ఆ వర్గ నాయకులను ఒక చోట చేర్చేందుకే ఆదివాసీ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక గిరిజన జనాభా గల ఈ జిల్లాలో ఈ వేడుక నిర్వహించడం హర్షణీయమని అన్నారు. పాల్వంచ మండలం కిన్నెరసాని క్రీడా పాఠశాలలో నిర్వహిస్తున్న ఆదివాసీ సమ్మేళనం చివరి రోజైన శనివారం భట్టితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నల్లమల డిక్లరేషన్ను తీసుకొచ్చామన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కిన్నెరసాని గిరిజన ఆశ్రమ పాఠశాలల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తండాలు, గూడేలను మొదట అభివృద్ధి చేసింది ఇందిరాగాంధీ హయాంలోనని గుర్తు చేశారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజనుల మనుగడను దెబ్బతిసేలా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య మాట్లాడుతూ ఆదివాసీలను ఐక్యం చేసి గిరిజన చట్టాలపై పూర్తి అవగాహన తీసుకొచ్చేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఆ తర్వాత మూడు రోజల సమ్మేళనంలో పాల్గొన్న ప్రతినిధులకు ధ్రువీకరణ పత్రాలు అందజేయగా గిరిజన మహిళలు నృత్యాలతో నాయకులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రాఘురాంరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, వైరా, డోర్నకల్, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, రామచంద్రునాయక్, మట్టా రాగమయి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, సమ్మేళన్ ఇన్చార్జ్ రాహుల్ బాల్, నాయకులు చందాలింగయ్యదొర, కోనేరు చిన్ని తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ స్థానిక కేటీపీఎస్ గెస్ట్హౌస్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి పార్టీ వ్యవహారాలపై దిశానిర్దేశం చేశారు.
ఆదివాసీ సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి