మూడు నెలలకు ఒకేసారి.. | - | Sakshi
Sakshi News home page

మూడు నెలలకు ఒకేసారి..

May 31 2025 12:22 AM | Updated on May 31 2025 12:22 AM

మూడు

మూడు నెలలకు ఒకేసారి..

● రేషన్‌ బియ్యం అందించేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు ● ఇప్పటికే గోదాంలకు స్టాక్‌ చేర్చిన అధికారులు ● వర్షాకాలం దృష్ట్యా లబ్ధిదారులు ఇబ్బందిపడకుండా చర్యలు

భద్రాచలంటౌన్‌: వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల రేషన్‌ పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. రేషన్‌ కార్డు లబ్ధిదారులకు జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సన్న బియ్యం జూన్‌లోనే అందించనుంది. ఇప్పటికే రేషన్‌ షాపుల గోదాంలకు బియ్యం చేర్చారు. జూన్‌ 1 నుంచి పంపిణీ చేయనున్నారు. ఏజెన్సీలో చిన్న చిన్న రేషన్‌ షాపుల్లో ఒకేసారి మూడు నెలల బియ్యం నిల్వ చేసే వీలు లేకపోవడంతో దశలవారీగా సరఫరా చేయనున్నారు. జాన్‌ చివరివరకు డీలర్లు మూడు నెలల కోటాను తీసుకెళ్లాలని పౌరసఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, గత ఏప్రిల్‌ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా, రేషన్‌ షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని చోట్ల రేషన్‌ షాపుల్లో మూడు నెలల సన్నబియ్యం నిల్వకు స్థలం లేక డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. కాగా లబ్ధిదారులు ఈ–పాస్‌ మిషన్‌పై మూడుసార్లు వేలిముద్ర వేసి సన్నబియ్యం తీసుకోవాల్సిఉంటుంది. వర్షాల కారణంగా ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ ముందుగానే అందించే ఏర్పాట్లు చేస్తోంది.

1.65 లక్షల క్వింటాళ్ల బియ్యం

జిల్లాలో మొత్తం442 రేషన్‌షాపులు, 2,93,683 రేష న్‌ కార్డులు ఉన్నాయి. వీటిపైనా ప్రతీ నెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 55 వేల క్విటాళ్ల బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. మూడు నెలలకు సంబంధించిన బియ్యం సుమారు 1.65లక్షల క్వింటా ళ్లను జూన్‌లోనే ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంది.

సద్వినియోగం చేసుకోవాలి

వర్షాకాలం దృష్ట్యా ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ బియ్యం ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలోని రేషన్‌ షాపుల గోదాంలకు సన్నబియ్యం సరఫరా చేశాం. డీలర్లు జూన్‌ 1 నుంచి 30వ తేదీ వరకు అందిస్తారు. రేషన్‌ షాపుల్లో నిల్వలను బట్టి బియ్యం సరఫరా చేస్తాం.

–రుక్మిణి, జిల్లా పౌరసరఫరాల అధికారి

పక్కదారి పట్టే అవకాశం!

వ్యవసాయ సీజన్‌లో గ్రామాల్లో ప్రజలు పనుల్లో బిజీగా ఉంటారు. మూడు నెల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయడంలో కొంత అవకతవకలు జరిగే అవకాశం ఉంది. ఏజెన్సీలో ఇప్పటికే ఈపాస్‌ యంత్రాలకు సర్వర్‌ మొరాయింపు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో డీలర్లు కార్డుదారుడితో మూడుసార్లు వేలి ముద్ర సార్లు వేయించి ఒక్కసారి రేషన్‌ ఇచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

మూడు నెలలకు ఒకేసారి..1
1/1

మూడు నెలలకు ఒకేసారి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement