
త్వరలో పూసపల్లి ఓసీ పనులు
● గని ప్రాంతంలో సాగుతున్న చెత్తాచెదారం తొలగింపు పనులు ● వచ్చే నెలలో భూమి పూజకు సన్నాహాలు ● మూడు నెలల్లో బొగ్గు వెలికి తీసేలా కార్యాచరణ
ఇల్లెందు: కేంద్ర పర్యావరణ, అటవీఽశాఖ అనుమతులు లభించడంతో జేకే ఓసీ(పూసపల్లి)పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే బొగ్గు వెలికి తీసే ప్రాంతంలో ఓబీ పనులు చేపట్టేందుకు చెత్తా చెదారం తొలగిస్తున్నారు. కొద్ది రోజుల్లో భూమి పూజ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాబోవు మూడు నెలల్లో బొగ్గు వెలికి తీయాలని వారం రోజుల క్రితం ఇల్లెందు సందర్శించిన సీఎండీ ఎన్.బలరాం జీఎం వీసం కృష్ణయ్యను ఆదేశించారు. పదేళ్లపాటు జేకే ఓసీ(పూసపల్లి)లో 1.9 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయనుండటంతో ఇల్లెందు సింగరేణి ఉద్యోగులు, అధికారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
పరిహారం కోసం నిర్వాసితుల ఆందోళన
నూతన ఓసీకి అనుమతులు లభించడంతో ఓబీ వెలికితీతకు టెండర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఓబీ పనులను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. మరోవైపు నిర్వాసితులు పరిహారం కోసం ఆందోళనలు చేపడుతున్నారు. 21 పిట్ ఏరియాలో వ్యవసాయభూములతోపాటు నివాస గృహాలు, పురాతన సింగరేణి క్వార్టర్లలో నివాసం ఉంటున్నవారు రోడ్డెక్కుతున్నారు. ఏడాది కాలంగా ఓసీ పనులను అడ్డుకుంటున్నారు. వారం క్రితం కూడా జీఎం ఆఫీస్ను ముట్టడించారు. రెండు రోజుల క్రితం ఓబీ పనులను అడ్డుకున్నారు. పరిహారం సమస్య పరిష్కారమైతేకానీ ఓసీ పనులు ప్రారంభమయ్యే పరిస్థితిలేదు.
తరలిపోతున్న డంపర్లు
ఇల్లెందులోని జేకే–5 ఓసీ కాలపరిమితి గత మార్చితో ముగిసింది. దీంతో ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. డంపర్ తదితర యంత్రాలను తరలిస్తున్నారు. గత వారంలో నాలుగు డంపర్లను మణుగూరుకు తీసుకెళ్లారు. 12 మంది ఆపరేటర్లను సత్తుపల్లికి బదిలీ చేశారు. కాగా రూ.297.88 కోట్లతో 1114.507హెక్టార్ల భూమిలో బొగ్గు వెలికి తీయనున్నారు. ఇల్లెందు మండలంలో రొంపేడు, సుదిమళ్ల, ఖమ్మం జిల్లాలో సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలో జేకే ఓసీ విస్తరించనుంది.
త్వరితగతిన పనులు
నూతన జేకే ఓసీ(ఫూసపల్లి) ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పత్రం విడుదలైంది. టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఓబీ వెలికితీసే పనులకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరితగతిన బొగ్గు వెలికితీసేలా చర్యలు తీసుకుంటాం.
–వీసం కృష్ణయ్య, ఇల్లెందు ఏరియా జీఎం

త్వరలో పూసపల్లి ఓసీ పనులు