జూలూరుపాడు: నేపాల్ దేశంలోని టోకరా ప్రాంతంలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్కు జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్యా తులసీనాయక్ ఎంపికయ్యాడు. మార్చి 22, 23, 24 తేదీల్లో హైదరాబాద్లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో అండర్–19 క్రికెట్ పోటీలు జరిగాయి. మహారాష్ట్ర – తెలంగాణ జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీలో తులసీనాయక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. దీంతో మే 16వ తేదీన నేపాల్లో జరిగే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో ఇండియా టీమ్లో ఆడేందుకు తనను ఎంపిక చేశారని తులసీనాయక్ విలేకరులకు తెలిపాడు. ఈ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో ఆడేందుకు రూ. 50 వేలు అవసరమని, పేద కుటుంబానికి చెందిన తాను అంత డబ్బు సమకూర్చుకోవడం కష్టమని వాపోయాడు. రెండేళ్ల క్రితమే తన తండ్రి లోకా మృతిచెందాడని, తల్లి సుజాత అనారోగ్య సమస్యతో బాధపడుతోందని చెప్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు తనకు ఆర్థిక సాయం చేయాలని దాతలకు విజ్ఞప్తి చేశాడు. ఆర్థిక సాయం అందించేవారు 95737 38199 నంబర్కు ఫోన్ పే చేయాలని కోరుతున్నాడు.