ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం భక్తులకు దర్శన అనంతరం కదంబ ప్రసాదం పంపిణీ కొనసాగిన సారె సమర్పణలు
ప్రణామం అంటూ భక్తితో కొలిచిన భక్తజనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అమ్మవారిని ఆకుకూరలు, కాయగూరలు, డ్రైఫ్రూట్స్తో అలంకరిస్తారు. తొలి రోజున అమ్మవారి ప్రధాన మూలవిరాట్తో పాటు మహా మండపం ఆరో అంతస్తు, ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాల్లోని పరివార దేవతలకు ఆకుకూరలు, కాయగూరలతో అలంకరించారు. ఆలయ పరిసరాలను అలంకరించేందుకు సుమారు 20 టన్నుల కూరగాయలను వినియోగించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
పూజా సామగ్రిగా కూరగాయల దండలు..
శాకంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు పూజా సామగ్రికి బదులుగా ఆకుకూరలు, కాయగూరలతో తయారు చేసిన దండలను అమ్మవారికి సమర్పించడం కనిపించింది. సారె, పూజా సామగ్రితో పాటు ఆకుకూరలు, కాయగూరలను మూల విరాట్తో పాటు ఉత్సవ మూర్తికి సమర్పించారు.


