ఏబీవీపీ నాయకుల ఆగ్రహం
మంగళగిరి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఇతర రంగాలపై పెట్టే దృష్టి విద్యావ్యవస్థపై పెట్టడం లేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు ఆరోపించారు. ఉన్నత విద్యావ్యవస్ధను సంస్కరించాలంటూ మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యాకార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవిపి నాయకులు మాట్లాడుతూ ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యామండలి నుండే కామన్ ఎంట్రన్స్ పరీక్షలను సకాలంలో నిర్వహించినా అడ్మిషన్లు మాత్రం జాప్యం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవిపి రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అఖిల్, సాయి, సురేంద్ర, జాతీయ కార్యవర్గ సభ్యురాలు వేదశ్రీ, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలీసుల అత్యుత్సాహం....
ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట ధర్నా చేసే సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు నాయకులు ఆరోపించారు. ఒక్కసారిగా నాయకులంతా కార్యాలయం లోపలికి వెళ్లడంతో పోలీసులు వారిపై దురుసుగా ప్రవర్తించారు. పోలీసులకు, ఏబీవీపీ నాయకులకు మధ్య తోపులాటలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. కార్యాలయం లోపలే నినాదాలు చేస్తున్నారని అక్కడి నుంచి వారిని బయటకు పంపించామంటూ పోలీసులు చెబుతున్నారు.


