తెనాలిరూరల్: యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కంచర్లపాలెంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కోపల్లె కార్తీక్(18) ఐటీఐ పూర్తి చేశాడు. ఆటోనగర్ నుండి సోమసుందరపాలేం వెళ్లే మార్గంలో కంచర్లపాలెం గ్రామ శ్రీవారు ప్రాంతంలో కార్తిక్ మృతిచెంది ఉండడాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాలీబాల్ కోర్టు వద్ద నెట్ వైరు గొంతుకు బిగించిన స్థితిలో పోల్కు వేలాడుతూ కనిపించాడు. డీఎస్పీ బి.జనార్ధనరావు, రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గుంటూరు నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడితో పాటు మరి కొందరు యువకులు మంగళవారం రాత్రి మద్యం తాగి, ఇంటికి వెళ్లే క్రమంలో బైక్లో పెట్రోలు అయిపోవడంతో నెట్టుకుంటూ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇంటికి వెళ్లిన కార్తిక్ బయటకు ఎందుకు వచ్చాడు? ఏం జరిగిందన్న విషయాలను దర్యాప్తు చేస్తున్నారు. ఒంటిపై/లోపల గాయాలు లేవని పోస్ట్ మార్టం సందర్భంగా వైద్యులు గుర్తించినట్టు తెలిసింది. మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలనున్నాయని సీఐ తెలిపారు.


