బాపట్ల: పెట్రో ధరలు పెంచి సామాన్యుడిపై పెనుభారాన్ని మోపటం సరికాదని బాపట్ల కార్మిక శక్తి ఆటో యూనియన్ నాయకులు కె.శ్యామ్బాబు పేర్కొన్నారు. బాపట్ల కార్మిక శక్తి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఇంధన ధరలు ఆటో కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపు తున్నాయని అన్నారు. వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. బాపట్ల ఆటో కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ సభ్యులు డి.సాంబశివరావు, జె.కోటయ్య, ఎం. నాగరాజు, షేక్ ఖాసిం పాల్గొన్నారు.
బాపట్ల: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పి.వి. సత్యనారాయణను బాపట్ల వ్యవసాయ కళాశాలతో పాటు ఇతర అనుబంధ కళాశాలల టైమ్ స్కేల్ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా మంగళవారం కలిసి అభినందించారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉద్యోగులు తమ సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి తప్పకుండా పరిష్కరిస్తానని డాక్టర్ పి.వి. సత్యనారాయణ హామీ ఇచ్చారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.ఏ.మణి, టైమ్ స్కేల్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.
నరసరావుపేట టౌన్: తన సర్టిఫికెట్లు అక్రమంగా వినియోగించిన డీమార్టు యాజమాన్యంతో పాటు సహకరించిన వ్యవసాయ అధికారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో వన్టౌన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గురజాల మండలం అంబాపురం గ్రామానికి చెందిన దోమతోటి స్వర్ణలత ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివింది. 2021లో గుంటూరు గుజ్జనగుండ్ల డీమార్టులో స్టాప్గా చేరింది. ప్రస్తుతం ఆమె నూజివీడు డీమార్టులో పనిచేస్తోంది. గత నెల 24వ తేదీ సరుకులు కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి నరసరావుపేట డీమార్టుకు వచ్చింది. అక్కడ తన పేరిట ఉన్న ఫెస్టిసైడ్ లైసెన్స్ను చూసి అవాక్కయింది. ఉద్యోగంలో చేరే సమయంలో ఆమె అందజేసిన సర్టిఫికెట్లతో అక్రమంగా డీమార్టు యాజమాన్యం లైసెన్స్ పొంది క్రిమిసంహారక మందులను విక్రయిస్తున్నట్లు తెలుసుకుంది. దీంతో వన్టౌన్ పోలీసులను ఆశ్రయించింది. తన ప్రమేయం లేకుండా లైసెన్న్స్ తీసుకొని వ్యాపారం నిర్వహిస్తున్న డీమార్టు హెచ్ఆర్ నక్కరాజుతో పాటు అప్పటి వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. తన సంతకాన్ని పోర్జరీ చేసి దుర్వినియోగనికి పాల్పడినట్లు వివరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు.


