కారంచేడు: గతంలో మాకు పెట్రోల్, డీజిల్ సమస్య ఎదురు కాలేదు.. ఈ సారి మాత్రం ఇంధన కొరత ఎదుర్కొంటున్నామని వాహనదారులు జిల్లా కలెక్టర్కు తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా కారంచేడు గ్రామంలో మూతపడిన బంకులను కలెక్టర్ డాక్టర్ వీ వినోద్కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో బంక్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడం వలన అక్కడ బంక్ యజమానులతో ఫోన్లో మాట్లాడారు. బంక్కు అవసరమైన పెట్రోల్, డీజిల్ కోసం డబ్బు చెల్లించామని, ఇంకా స్టాక్ రాలేదని యజమానులు వివరించారు. అనంతరం అక్కడకు పెట్రోల్, డీజిల్ కోసం వచ్చిన వినియోగదారులతో ఆయన మాట్లాడారు. గతంలో ఈ పెట్రోల్ బంక్ల వద్ద ఇలా సమస్యలు ఉన్నాయా, ఇప్పుడే ఈ సమస్యలు ఉన్నాయా అని అడిగారు. గ్రామంలోని రెండు బంక్లు అందుబాటులో ఉన్నాయని, గతంలో ఎప్పుడూ ఈ సమస్యను మేము ఎదుర్కోలేదన్నారు. గ్రామంలోని రెండు బంక్ల వద్ద ఇలాంటి సమస్యలు ఎదురైతే మాత్రమే మేము చీరాలకు వెళ్లి పెట్రోల్, డీజిల్ కోనుగోలు చేసుకుంటామని తెలిపారు. ఒక్కోసారి మండలంలోని స్వర్ణ గ్రామంలోను పెట్రోల్, డీజిల్ తెచ్చుకుంటామన్నారు. రైతులు ఎక్కువగా ఉంటారని, వారు మాత్రమే అవసరాలను బట్టి క్యాన్ల ద్వారా డీజిల్ తెచ్చుకొని పెట్టుకుంటామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎవరూ డీజిల్ గురించి ఆందోళన చెందవద్దన్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైదని, అన్ని బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటుందన్నారు.
పెట్రోల్ బంక్లను తనిఖీ చేసిన కలెక్టర్


