ఏ దారి కానరాక..! | - | Sakshi
Sakshi News home page

ఏ దారి కానరాక..!

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

● గతంలో రేపల్లె ఆర్డీఓగా పనిచేసిన రామలక్ష్మి వివాదాస్పద మార్గాన్ని పరిశీలించి కోర్టు తీర్పు వచ్చే వరకు ఇరువర్గాల రైతులు బళ్ల మార్గం విషయంలో ఎటువంటి చర్యలకు దిగవద్దని ఆదేశించారు. అయితే నెల రోజుల క్రితం పంట ఉత్పత్తుల తరలింపునకు రైతులు ఏర్పాటు చేసుకున్న మార్గాన్ని ఆక్షేపించిన పెద్ద రైతులు పొక్లెయిన్‌ సాయంతో కాలువ పేరిట తవ్వించడం వివాదాస్పదంగా మారింది. నెల రోజుల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తమ పంట ఉత్పత్తుల తరలింపునకు ఉన్న దారి సమస్యను పరిష్కరించాలని చిన్న, సన్నకారు రైతులు ప్రదక్షిణలు చేయడంతోపాటు, పీజీఆర్‌ఎస్‌లో అర్జీలను సమర్పించారు. ప్రస్తుతం మొక్కజొన్న, జొన్న పంట దిగుబడులు తరలించుకునే సమయం అసన్నమైనప్పటికీ అధికార టీడీపీ నాయకుల ఒత్తిడి కారణంగా రెవెన్యు అధికారులు స్పందించకపోవడంతో నిరసనకు దిగారు. ఉదయం 10 గంటల నుంచి రైతులు, మహిళలు కార్యాలయంలో బైఠాయించి సమస్య పరిష్కరిస్తేనే కదులుతామంటూ భీష్మించుకొని కూర్చున్నారు. 5 గంటల పాటు తహసీల్దార్‌ గది ఎదుటే రైతాంగం బైఠాయించడంతో తహసీల్దార్‌ బి.వెంకటేశ్వర్లు వివాదాస్పద దారి వద్దకు వెళ్లి పరిశీలించారు. పంట పొలాలకు దారి కోసం పోరు బాట పట్టిన రైతుల పక్షాన అన్నిపార్టీల నాయకులు ఏకతాటిపైకి వచ్చి మద్దతుగా నిలిచి నిరసనలో పాల్గొన్నారు. బాధిత రైతుల్లో టీడీపీ బీసీ నాయకుడు, వేమూరు మార్కెట్‌యార్డు డైరెక్టర్‌ పోతార్లంక కుటుంబరావు, వైఎస్సార్‌ సీపీ బీసీ నాయకుడు కొల్లూరు శ్రీను సైతం ఉన్నారు. రైతులకు మద్దతుగా నిలిచిన వారిలో జనసేన మండల అధ్యక్షుడు బొందలపాటి చలమయ్య, బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు బొమ్మిడి వెంకటేశ్వరరావు, సీపీఎం నాయకులు టి.కృష్ణమోహన్‌, బొనిగల సుబ్బారావులు ఉన్నారు.

పంటపొలాలకు దారి సమస్యపై రైతుల పోరు‘బాట’

టీడీపీ నేతల అండతో పంట ఉత్పత్తుల తరలింపునకు ఉన్న దారిని మూసేసిన పెద్ద రైతులు కొల్లూరు రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడించిన చిన్న, సన్నకారు రైతులు టీడీపీ నాయకుడి ఒత్తిడికి రెవెన్యూ యంత్రాంగం తలొగ్గుతున్నారని ఆక్రోశం దారి సమస్య బాధిత రైతాంగంలో టీడీపీ, వైఎస్సార్‌ సీపీ నాయకులు

రేపటిలోగా పరిష్కరిస్తాం..

కొల్లూరు: పంట ఉత్పత్తుల తరలింపునకు ఉన్న బాటను సాధించుకునేందుకు అన్నదాతలు పోరు బాట పట్టారు. రెక్కల కష్టంతో శ్వేదం చిందించి సంపాదించుకున్న సొమ్మును విరాళాల రూపంలో సేకరించుకొని రూ.7లక్షలు వెచ్చించి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న బళ్ల దారి మార్గాన్ని పచ్చ పార్టీ నాయకుల అండదండలతో కబళిస్తున్న పెద్ద రైతుల కబంధ హస్తాల నుంచి దక్కించుకునేందుకు కర్షకులు రోడ్డెక్కి నిరసన గళం విప్పారు. టీడీపీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి ఒత్తిళ్లకు తలొగ్గి రెవెన్యూ యంత్రాంగం దారి సమస్యను పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ రైతులు రెవెన్యు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సోమవారం కొల్లూరు రెవెన్యు కార్యాలయ ఆవరణలో బైఠాయించి సన్న, చిన్న కారు రైతులు నిరసన వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది..

కొల్లూరు శివారు కేటీ కాలనీ మార్గంలోని ఈద్గా వద్ద ఉన్న బళ్ల బాట విషయంలో గత కొద్ది కాలంగా వివాదం నడుస్తుంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం బళ్ల బాటగా ఉన్నప్పటికీ, సాగునీటి పారుదల కాలువ, బోదె కాలువల ఏర్పాటులో ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం సమస్యకు ప్రధాన కారణంగా మారింది. గతంలో బళ్ల మార్గం ద్వారా పంట ఉత్పత్తులను తరలించుకోవడానికి అవకాశం ఉందన్న విషయం తెలుసుకున్న 200 ఎకరాల పై చిలుకు పంట భూములున్న సన్న, చిన్న కారు రైతులు స్వచ్ఛందంగా చందాలు వేసుకొని వంతెన నిర్మించుకొని పంట ఉత్పత్తుల తరలింపునకు వీలుగా బళ్ల మార్గాన్ని పునరుద్ధరించారు. అయితే కేటీ కాలనీ ప్రధాన మార్గానికి ఆనుకొని ఉన్న ఒకరిద్దరు రైతులు బళ్ల మార్గం ఏర్పాటు విషయంలో ఆక్షేపించడంతో దారి అంశంపై కోర్టును ఆశ్రయించారు.

రైతుల పంటపొలాలకు వెళ్లాల్చిన దారి సమస్య పరిష్కారానికి కొద్ది గడువు కోరడం జరిగింది. దారి వివాదం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బుధవారం లోపు సమస్యను పరిష్కరిస్తాం. బుధవారం నుంచి రైతులు సాగు చేసిన మొక్కజొన్న, జొన్న పంటలను బళ్ల మార్గం ద్వారా తరలించుకునేలా చర్యలు తీసుకుంటాం.

– బి.వెంకటేశ్వర్లు, కొల్లూరు తహసీల్దార్‌

Advertisement
 
Advertisement
Advertisement