జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ రేపల్లెలో అవగాహన ర్యాలీ
రేపల్లె: వాహనచోదకులు హెల్మెట్ను ధరించి చేసే ప్రయాణమే సురక్షితమైనదని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అన్నారు. శిరో రక్ష –ప్రాణ రక్ష కార్యక్రమంలో భాగంగా సోమవారం ఓల్డ్టౌన్ అంకమ్మ చెట్టు సెంటరులో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో వాహన చోదకులకు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదాలు వాటిల్లిన సమయంలో హెల్మెట్ రక్షణగా ఉంటుందన్నారు. తలకు ఎటువంటి గాయాలు తగలకుండా కాపాడుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తుచేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి నేటి వరకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తూ 50 అవగాహన ర్యాలీలు, 159 సదస్సులు నిర్వహించామన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పోలీసు సిబ్బందితో ద్విచక్రవాహనాలపై హెల్మెట్ ధరించి ఓల్డ్టౌన్ నుంచి రింగురోడ్డు, ఓపెన్ థియేటర్, బస్టాండ్ సెంటరు అక్కడి నుంచి పద్మావతి సెంటరు మీదగా పోలీసుస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్, సీఐలు మల్లికార్జునరావు, సురేష్, సర్కిల్ పరిధిలోని పోలీసుస్టేషన్ల ఎస్ఐలు, కానిస్టేబుల్స్, సిబ్బంది పాల్గొన్నారు.


