వేమవరం(భట్టిప్రోలు): భట్టిప్రోలు మండలం సూరేపల్లి పంచాయతీ పరిధిలోని వేమవరంలో కొలువైన శ్రీ రుక్మాబాయి సహిత శ్రీ పాండురంగ స్వామివారి దేవస్థానంలో శనివారం స్వామి వారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు జరిపారు. ఆదివారం తెల్లవారు జామున విశేష పంచామృత అభిషేకాలు జరుగనున్నట్లు అర్చకులు ధారా నారాయణ మూర్తి తెలిపారు. అదే విధంగా వేమవరం గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారికి నైవేద్యాలను సమర్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమాలను దేవాలయ కార్యనిర్వాహక వర్గం పర్యవేక్షించారు. కల్యాణ క్రతువును వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అలానే ఐలవరం గ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలను యునెస్కో వాస్తు పండిట్ వంగర చలమయ్య సిద్ధాంతి నిర్వహించి పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు అన్నసమారాధన కార్యక్రమం చేపట్టారు.


