మహిళలకు మరిన్ని..
తెరపైకి ‘తెనాలి’
చిగురిస్తున్న ఆశలు
సాక్షి, నరసరావుపేట: దేశంలో లోక్సభతోపాటు శాసనసభ స్థానాల పునర్విభజనకు కేంద్రం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో అందరి నోటా ఇదే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలోనే ఈ బిల్లును ఆమోదించేలా అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో నేతలు ‘కొత్త’ లెక్కలేసుకుంటున్నారు. జిల్లాలో కొత్తగా ఎన్ని సీట్లు పెరగనున్నాయి, ఏ మండలాలతో ఏర్పడితే రాజకీయంగా తమకు అనుకూలమనే ఆలోచనలో వారు ఉన్నారు. సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు తమ సొంత మండలం కొత్తగా ఏర్పడే వేరే నియోజకవర్గంలోకి వెళితే ఏం చేయాలన్న ఆలోచనలు మొదలుపెట్టారు. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా పునర్విభజన ద్వారా ఏకంగా 50 శాతం స్థానాల సంఖ్య పెరుగుతాయన్న వార్తలతో ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
చట్టసభలకు వెళ్లాలనుకునే వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెరగడం, మహిళా రిజర్వేషన్ అమలులోకి రానుండటంతో కొత్తవారికి చట్టసభలకు వెళ్లే అవకాశాలు పెరగనున్నాయి. 2008లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి జిల్లాలో కొంతమేర మార్పుచేర్పులు జరగగా... తాజా పునర్విభజనతో సమూల మార్పులు రానున్నాయని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కేవలం అసెంబ్లీ స్థానాలు మాత్రమే మార్పు జరగగా... ఈసారి లోక్సభ స్థానాలలో సైతం పునర్విభజన జరగనుంది.
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో ఏడు చొప్పున, బాపట్ల జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. తాజా పునర్విభజన తరువాత ఉమ్మడి జిల్లాలో కొత్తగా 8 నుంచి 9 స్థానాలు పెరిగే అవకాశముంది. దీంతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 25గానీ, 26గానీ కానుంది. గతంలో అసెంబ్లీ స్థానాలుగా ఉండి రద్దు అయిన ఫిరంగిపురం, పెదకాకాని, దుగ్గిరాలలతోపాటు గుంటూరు రూరల్, నగరం, రొంపిచర్ల, పిడుగురాళ్ల, కారంపూడి, అమరావతి వంటి కొత్త అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ స్థానాలు కొత్తగా మరో 9 పెరగనున్న నేపథ్యంలో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మరోవైపు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో తాడికొండ, ప్రత్తిపాడు, వేమూరు నియోజకవర్గాలు ఎస్సీ సామాజికవర్గానికి రిజర్వు కాగా... ఈ సంఖ్య పునర్విభజన తరువాత పెరగనుంది. ప్రస్తుతం గుంటూరు ఈస్ట్, వెస్ట్తోపాటు తెనాలి, నరసరావుపేట వంటి అర్బన్ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశముంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో అసెంబ్లీ స్థానాలు 17 నుంచి 26కు పెరిగితే అందులో మూడో వంతు మహిళలకు రిజర్వు కానున్నాయి. ఈ లెక్కన 9 అసెంబ్లీ స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్లు రాష్ట్రాన్ని యూనిట్గా చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్య ఒకటి తగ్గడం లేదా పెరగడం జరిగే అవకాశముందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు లోక్సభ స్థానాలలో సైతం ఒకటి లేదా రెండు ప్రత్యేకంగా మహిళలక రిజర్వు అయ్యే అవకాశముంది. మహిళా రిజర్వేషన్ ద్వారా చట్టసభలకు వెళ్లే అతివల సంఖ్య ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి పెరగనుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాత్రమే మహిళా ఎమ్మెల్యే ఉన్నారు.
నియోజకవర్గాల పునర్విభజనపై ప్రజల్లో చర్చలు.. నేతల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులు ఉత్సాహంగా ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూపురేఖలు పూర్తిగా మారేలా అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ ప్రాంతం ఏ నియోజకవర్గంలో ఉంటోందననే లెక్కలు అప్పుడే మొదలయ్యాయి.
9 శాసనసభ, 2 లోక్సభ
నియోజకవర్గాలు కొత్తగా
ఏర్పడే అవకాశం
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో
అతివలకు మరింత అందలం
ఎనిమిది నుంచి తొమ్మిది
స్థానాలు మహిళలకు కేటాయింపు
ఏ ప్రాంతం ఏ నియోజకవర్గంలోనో..
అభ్యర్థి ఎవరో.. అంటూ ప్రజల్లో చర్చ
భవిష్యత్ ఎలా ఉంటుందోనని
ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్న
రాజకీయ నేతలు


