తాడికొండ: రాజధాని పరిధిలో రాయపూడి – తుళ్లూరు గ్రామాలకు చేరువలో మేఘా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన స్టాక్ పాయింట్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి మంగళవారం పరిశీలించారు. ఎల్పీఎస్ జోన్ – 6 అభివృద్ధి కోసం తీసుకొచ్చిన మెటీరియల్ స్టాక్ను కాంట్రాక్టర్ ఇక్కడ ఉంచారని, ఈ ప్రమాదంలో ఎల్పీఎస్ నిర్మాణ పనులకు తీసుకువచ్చిన వివిధ రకాల యుటిలిటీ పైపులు అగ్నికి ఆహుతైనట్లు ఏడీసీ చీఫ్ ఇంజినీరు సీహెచ్ ధనుంజయ సీఎండీకి వివరించారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. అగ్ని ప్రమాదానికి కారణాలను లోతుగా పరిశోధించాలని ఆమె ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్టాక్ పాయింట్లలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులకు సూచించారు.
పరిశీలించిన ఇంటిలిజెన్స్ ఎస్పీ, జిల్లా ఎస్పీలు
తాడికొండ: రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు మండలం రాయపూడి సమపంలో మేఘా ఇంజినీరింగ్ కంపెనీ స్టాక్ యార్డు వద్ద మంగళవారం పైపులు తగలబడిన ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘటనా స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసకున్నారు. ఆర్ఎఫ్ఎస్ఎల్, ఎఫ్ఎస్ఎల్ బృందాలతో కలిసి పరిసరాలను పరిశీలించి 22 లాటులు పీఎల్బీ పైపులు కాలిపోయినట్లు గమనించారు. ప్రమాదానికి కారణమైన వారిని తక్షణమే గుర్తించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. సీసీ టీవీ పుటేజీలు పరిశీలించడంతో పాటు పాత నేరస్తులు, అనుమానితుల కదలికలను గమనించాలని సూచించారు. ఆయన వెంట లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్, తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


