మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరులో మంగళవారం రాత్రి మరో సైబర్ క్రైమ్ వెలుగు చూసింది. అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక నాగరాజుపల్లి సెంటర్లో మెడికల్ షాప్ నిర్వహించే ఓ యువకుడి వద్దకు సుమారు 20 రోజుల క్రితం ఓ అపరిచిత వ్యక్తి వచ్చాడు. తన బ్యాంకు ఖాతా నుంచి పరిమితికి మించి నగదు డ్రా చేసుకున్నందున టాక్స్ సమస్యలు ఉంటాయని నా స్నేహితుడు నీ బ్యాంకు ఖాతాలో రూ.ఐదు లక్షలు జమ చేస్తాడని, అవి నీవు డ్రా చేసి నాకు ఇస్తే లక్ష కు రూ.3 వేల చొప్పున రూ.5 లక్షలకు రూ.15 వేలు కమీషన్గా ఇస్తానని మెడికల్ షాప్ యువకుడిని నమ్మించాడు. అతడిని నమ్మిన మెడికల్ షాప్ యువకుడు తన బ్యాంక్ ఖాతా నంబరును అపరిచిత వ్యక్తికి ఇచ్చాడు. తరువాత పనులన్నీ చకచకా జరిగిపోయాయి. మెడికల్ షాప్ యువకుడి బ్యాంకు ఖాతాలో గుర్తు తెలియని మరో బ్యాంక్ ఖాతా నుంచి రూ.5 లక్షలు జమయ్యాయి. తన ఫోన్కు వచ్చిన మెసేజ్ చూసుకున్న మెడికల్ షాప్ యువకుడు అపరిచిత వ్యక్తికి రూ.5 లక్షలు డ్రా చేసుకోవడం కోసం తన బ్యాంకు చెక్ ఇచ్చి ముందుగానే రూ.లక్షకు రూ.3 వేల చొప్పున రూ.15 వేలు కమీషన్ అందుకున్నాడు. ఇది జరిగిన 20 రోజులు తర్వాత మంగళవారం సాయంత్రం హైదరాబాదు నుంచి వచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు మెడికల్ షాప్ యువకుణ్ణి అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి వారికి సమాచారం అందించి ఆ యువకుడిని హైదరాబాద్ తీసుకువెళ్లారు. కోలలపూడి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడి బ్యాంకు ఖాతా నుంచి ఓ కిలాడి మహిళ రూ.కోటి తొమ్మిది లక్షలు మాయం చేసి నాలుగు రోజులు కూడా గడవకముందే మరో ఉదంతం వెలుగు చూడటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
క్షయ వ్యాధి నివారణపై అవగాహన పెంచాలి
జిల్లా వైద్యాధికారిణి డాక్టరు విజయమ్మ
బాపట్ల: క్షయవ్యాధి నివారణపై ప్రజలలో అవగాహన పెంచాలని జిల్లా వైద్యాధికారిణి డాక్టరు విజయమ్మ పేర్కొన్నారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బాపట్ల పట్టణంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టరు విజయమ్మ మాట్లాడుతూ 100రోజులు పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి ఒక్కరు టీబీవ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ అధ్యక్షులు బి.ఎస్.నారాయణభట్టు, డాక్టరు సోమల నాయక్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
రేపల్లె: పట్టణంలోని ఓల్డ్ టౌన్లో వేంచేసియున్న గ్రామదేవత బూరగలమ్మ వారికి పుష్కర మహా కుంభాభిషేక మహోత్సవాలు మంగళవారంతో రెండవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అమ్మవారికి వేకువ జాము నుంచే ఆలయ అర్చకులు నందివెలుగు భానుసుధాకర్ గురుకులు, బాలాజీ గురుకులు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పట్టు, రజత వస్త్రాలంకరణ చేశారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో నిత్య హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మ వారికి మొక్కుబడులు తీర్చుకున్నారు.


