బాపట్ల: మండలంలోని జిల్లెళ్ళమూడి అమ్మవారి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. దేవాలయంలోని శ్రీ హైమాలయోత్సవములలో విశ్వజననిగా, అన్నపూర్ణేశ్వరిగా ప్రసిద్ధిగాంచిన మాతృశ్రీ అనసూయ మహాదేవికి ప్రత్యేక పూజలు చేపట్టారు. పుణ్యక్షేత్రంలో 27వ తేదీ వరకు శ్రీ హైమాలయోత్సవములు, 28, 29 తేదీలలో 104వ జన్మదినోత్సవాలు జరగనున్నాయి. 25న సామూహిక శ్రీ హైమవతి వ్రతాలు, 26న మూలవిరాట్కి ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీరామనవమి సందర్భంగా 27న శ్రీ అనసూయేశ్వరాలయంలో శ్రీ సీతారాముల ప్రత్యేక పూజ, భజనలు ఉంటాయి. 28న శ్రీ అనసూయా మహాదేవి 104వ జన్మదినోత్సవము సందర్భంగా అమ్మ జన్మస్థలమైన మన్నవ గ్రామంలో, ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక అనసూయా వ్రతాలు, అనంతరం అన్న ప్రసాద వితరణ ఉంటుంది. 29న శ్రీ అనసూయేశ్వరాలయంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక అనసూయా వ్రతాలు, కిరీట ధారణ తదితర కార్యక్రమాలు చేపడుతారు. ఈ మేరకు ట్రస్టు కోశాధికారి జొన్నాభట్ల సుబ్రహ్మణ్యం తెలిపారు.


