పెదకాకాని: కూటమి ప్రభుత్వంలో నాయకుల పర్యవేక్షణలో జరిగిన బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. మహోత్సవం పెదకాకాని పొలిమేర సెంటర్ జెండా చెట్టు నుంచి బయలుదేరి గురువారం రాత్రి 2 గంటలకు వెనిగండ్లలోని వేమారెడ్డి గుడి సమీపంలోకి చేరుకుంది. ఆ సమయంలో ఆటో పక్కనే నిలబడి బాణసంచా కాలుస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఆకాశంలోకి వదిలిన తారాజువ్వ నుంచి నిప్పురవ్వలు ఆటోలో నిల్వ ఉన్న బాణసంచాపై పడ్డాయి. ఆటోకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బాణసంచాపై పడుకుని నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు ఆ మంటల్లో చిక్కుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి అనాస్ పరిస్థితి విషమంగా ఉండగా.. అజయ్ అనే చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరికీ తండ్రులు లేదు. తల్లులు దర్గా వద్ద పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్నారు. గుంటూరు ఆర్డీఓ కె. శ్రీనివాసరావు, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, తహసీల్దార్ కృష్ణకాంత్, టీపీ నారాయణస్వామిలు పరామర్శించారు. నిద్ర వస్తుండటంతో బాణసంచాపై పడుకుని ఉన్నామని, పక్కకు వెళ్ళి కాల్చాలని ఆ వ్యక్తిని కోరామని బాధితులు తెలిపారు. అయినప్పటికీ అతడు వినిపించుకోలేదని వాపోయారు.


