ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుభాని డిమాండ్
సత్తెనపల్లి: కొత్త పెన్షన్ రూల్స్ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేవిగా ఉండాలని ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ఎమ్ సుభాని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు కొత్త పెన్షన్ రూల్స్–2026 లో ముసాయిదా విడుదలలో భాగంగా 1980 నుంచి ఉన్న వాటిని కాకుండా, 33 ఏళ్ళ సర్వీసు నిండితే పబ్లిక్ ఇంటరెస్ట్ దృష్ట్యా రిటైరవ్వమని తెలియజేసే అధికారం, జీత నష్టం, సెలవు కాలాన్ని పెన్షన్ లెక్కింపునకు పరిగణనలోకి తీసు కొనబడదనే అంశం ఇబ్బంది కలిగించేలా రూపొందించటం తగదన్నారు. ముసాయిదా నిర్మాణంలో వ్యతిరేక అంశాలను చేర్చితే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి పెద్ద ఎత్తున ఉద్యమకార్యాచరణ రూపొందిస్తామన్నారు. కొత్తచట్టాలు, ముసాయిదాలు ఎప్పుడూ పాతవాటికంటే మెరుగ్గా ఉండాలి కాని, ఉన్నవాటిని హరించే విధంగా ఉండకూడదన్నారు.
ఉద్యోగ సంఘాల్లో మహిళల ప్రాతినిధ్యం కీలకం
●ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు టీవీ రామిరెడ్డి
●మార్చి 7న సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో మహిళా దినోత్సవం
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో మహిళా ప్రాతినిధ్యం ఎంతో కీలకమని, వారి సలహాలు, సూచనలు ఎంతో ముఖ్యమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు టీవీ రామిరెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమీపంలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మార్చి 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి రామిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర మహిళా కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న హేమలతతోపాటు గుంటూరు జిల్లా మహిళా కార్యవర్గం నూతన అధ్యక్షురాలిగా ఎన్నికై న షేక్ షబానా సుల్తానాను ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్లా వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, జిల్లా కోశాధికారి పెద్ద రత్తయ్య, నగర శాఖ అధ్యక్షులు కరీముల్లా షా ఖాదరి, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి సంధ్యారాణి, లక్ష్మీనారాయణ, శోభన్ బాబు, అలీసు, వెంకటరమణ, గాయత్రి, హైందవి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.


