ఉత్కంఠభరితంగా ఎడ్ల పూటీ లాగుడు పోటీలు
నందిగామరూరల్: మండలంలోని దాములూరు కూడలిలో వేంచేసియున్న సంగమేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల పూటీ లాగుడు పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. జూనియర్ విభాగంలో బుధవారం రాత్రి నిర్వహించిన పోటీలను సర్పంచ్ గాదెల వెంకట రామారావు, ఆలయ చైర్మన్ గింజుపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ విభాగంలో మొత్తం 13 జతలు పోటీపడినట్లు తెలిపారు. 1.50 క్వింటాళ్ల బరువును ఆరుగురు వ్యక్తుల సహకారంతో 10 నిముషాల వ్యవధిలో లాగాయని వివరించారు. ఈ పోటీలను తిలకించేందుకు భారీసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో రిఫరీ నాగిరెడ్డి, రైతు కమిటీ సభ్యులు జవ్వాజి భాస్కరరావు, వట్టికొండ చంద్రమోహన్, చల్లా తులసీరావు, చెరుకూరు హైమారావు తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ విభాగంలో విజేతలు..
సీనియర్ విభాగానికి సంబంధించి మంగళవారం రాత్రి నిర్వహించిన ఎడ్ల పూటీ లాగుడు పోటీలలో బాపట్ల జిల్లా అమృతలూరు మండలం పెద్దపూడి గ్రామానికి చెందిన కాళ్ల హరికృష్ణయాదవ్ ఎడ్ల జత 10 నిముషాల వ్యవధిలో 4,842 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. బాపట్లజిల్లా చెరుకుపల్లి మండలం పగడంవారిపాలెం గ్రామానికి చెందిన కుంచల వేదశ్రీ లతారెడ్డి ఎడ్లజత 4,465 అడుగులు, బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం ఆవులదొడ్డికి చెందిన గోగినేని జ్ఞానసాయిచౌదరి ఎడ్ల జత 4,451 అడుగుల దూరం లాగి వరుసగా ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచినట్లు నిర్వాహకులు వివరించారు. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం కల్లంవారిపాలెం గ్రామానికి చెందిన కల్లం విజయలక్ష్మి ఎడ్ల జత 3,936 అడుగుల దూరం లాగి నాలుగోస్థానం, కృష్ణాజిల్లా బాపులపాడు మండలం సోమ రాజువారిపాలెం గ్రామానికి చెందిన కొలుసు జశ్వంత్ ఎడ్ల జత 3,706 అడుగుల దూరం లాగి ఐదో స్థానంలో నిలిచాయి. విజేత ఎడ్లజత యజమానులకు వరుసగా రూ.35 వేలు, రూ.30వేలు, రూ.25వేలు, రూ.20వేలు, రూ.15వేలను నగదు బహుమతిగా అందజేశారు.
ప్రథమస్థానంలో నిలిచిన బాపట్ల జిల్లా ఎడ్లు


