
మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో చైర్పర్సన్ వి.నిర్మల కుమారి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఎన్జీఓలో ఉన్న వివిధ శాఖల ఉద్యోగుల సంఘాలలో మహిళా ఉద్యోగ సంఘం కీలకపాత్ర పోషించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ వినియోగంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించి వాటిని సవరించి, స్పష్టత కలిగించే ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ పి.మాధవి, కోశాధికారి శివలీల, కో కన్వీనర్ వి.వి.లలితాంబ, రాష్ట్ర కార్యదర్శి బి.తులసిరత్నం, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
582 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 582.90 అడుగులకు చేరింది. ఇది 291.3795 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 511, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 29,151, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 93,115 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.