
నిబంధనల మేరకే పొగాకు కొనుగోలు
జే.పంగులూరు: నిబంధనల మేరకే నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేస్తామని.. ఇప్పటికి రైతులు వద్ద నుంచి 1000 చెక్కుల వరకు కొనుగోలు చేశామని, గ్రేడుల ప్రకారమే ధర నిర్ణయిస్తున్నట్లు మార్క్ఫెడ్ డీఎం కే కరుణశ్రీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ పీ రమేష్ అన్నారు. మండల పరిధిలోని పంగులూరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ జిల్లా అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసేందుకే పంగులూరులో నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరి వద్ద పొగాకు కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు సహకరించి గ్రేడ్ చేసి పొగాకు చెక్కులు తీసుకొస్తే మంచి ధర పలుకుతుందని తెలిపారు. రైతులు వద్ద నల్లబర్లీ పొగాకు కొనాలంటే తప్పనిసరిగా బేళ్ల వద్ద ఫొటో దిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. అలా చేస్తేనే పొగాకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో షెడ్యూలు అయిన రైతులు వద్ద నుంచి పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. పచ్చాకు, బొగులు, నలుపు, డ్యామేజ్ ఉంటే పొగాకు కొనుగోలు చేయమని తెలిపారు. కారణం లేకుండా సీఆర్ చేయడం కుదరదని తెలిపారు. రాబోయే 2, 3 రోజుల్లో తమ్మవరం, మార్టూరు, చినగంజాం గ్రామాల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రైతులు ఆందోళన..
అధికారులు రైతుల వద్ద నుంచి వారి ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే చేలో పండించిన పంట, శుభ్రంగా గ్రేడ్ చేసుకొని, చెక్కులు తొక్కుకొని వస్తే వాటిలో కొన్నింటిని మాత్రమే కొని, మిగతా వాటిని తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేడ్ చేసుకొని వచ్చిన మంచి రకం పొగాకును కూడా కొనుగోలు చేయడం లేదని రైతులు తెలిపారు. స్పందించిన అధికారులు మాట్లాడుతూ రైతులు తెచ్చిన నల్లబర్లీ చెక్కులు మంచివిగా ఉండి కొనుగోలు చేయకపోతే మా దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులు బయ్యర్లను అడగ్గా బాగోలేని చెక్కులు మాత్రమే వెన్కు పంపుతున్నట్లు సమాధానం ఇచ్చారు. మాకు కాదు మీరు చెప్పాల్సిందంటూ రైతులకు అని బయ్యర్లపై మండిపడ్డారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మార్క్ఫెడ్ మేనేజర్ పి సుబ్రమణ్యం, ఏఓ సుబ్బారెడ్డి, బయ్యర్ శ్రీధర్, ఏఎంసీ సెక్రటరీ కె సుర్యప్రకాష్రెడ్డి, అసిస్టెంట్ మార్కెటింగ్ కె రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తున్నారని రైతుల ఆందోళన సమాధానం చెప్పలేక తడబడిన మార్క్ఫెడ్ అధికారులు