
గంగపుత్రులపై కేసులు దుర్మార్గం
చీరాల టౌన్: ప్రకృతి వనరులు దోచుకోవడంతోపాటుగా అధికారమే శాశ్వతం అనుకుని అక్రమాలు చేయడంతోపాటుగా బీచ్నే కబ్జా చేసి మత్స్యకారుల జీవనానికి అడ్డుగా నిలిచి సీ మౌత్ను మూసేసిన బుర్ల వెంకటరావుపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఏపీ మత్స్యకార, మత్య్సకార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని విజయలక్ష్మీపురంలోని మత్స్యకారులకు సీపీఎం నాయకులు సంఘీభావం ప్రకటించారు. మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిఽ కొల్లాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారి బుర్ల వెంకటరావు అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో సముద్రాన్ని కజ్జా చేయడం దారుణమన్నారు. చీరాల, బాపట్ల నియోజకవర్గాల పరిధిలోని 12 మత్స్యకార గ్రామాల ప్రజలు, మెకనైజ్డ్ బోట్లు, 2 వేల మోటార్ బోట్లుతో 14వేల మంది మత్స్యకారులు సముద్రంలో వేట చేస్తున్నారని, వేట అనంతరం బోట్లు, పడవలను ఈపురుపాలెం స్ట్రయిట్కట్ ప్రాంతంలో నిలుపుదల చేస్తున్నాన్నారు. సీఆర్జడ్ పరిధి దాటి సీ మౌత్ను మూసేసి, ఇరిగేషన్ భూమిని ఆక్రమించి మత్య్సకారులు వేటకు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. గంగపుత్రులను సామాజికంగా, ఆర్థికంగా నష్టపరుస్తున్న బుర్ల వెంకటరావుపై కఠిన చర్యలు తీసుకోకుండా అధికారులు, పోలీసులు రక్షణగా నిలవడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమణలు, కబ్జాలు, ప్రభుత్వ పెద్ద అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో ఆన్లైన్ చేయించుకున్నారన్నారు. వెంకటరావు ఆగడాలకు అధికారపార్టీ అండగా నిలవడం తగదన్నారు. తమ జీవనానికి ఇబ్బందులు పడుతున్నామని సీమౌల్ మూయవద్దని కోరిన మత్స్యకారులపై కేసులు పెట్టించడం క్షమించరానిదని, మత్స్యకారుల సత్తా ఏంటో చూపుతామని హెచ్చరించారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం, బుర్ల వెంకటరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నామని, మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని స్ట్రయిట్ కట్ మొగ పునరుద్ధరణ సాధన సమతి కన్వీనర్ ఎరిపిల్లి రమణ పిలుపునిచ్చారు. చీరాల–బాపట్ల సరిహద్దు ప్రాంతంలోని సమస్యను అధికారులు పరిష్కరించి మత్స్యకారులకు అండగా నిలవకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మత్స్యకారులు, నాయకులు బాబురావు ఉన్నారు.
కబ్జాదారుడు వెంకటరావుపై చర్యలు తీసుకోవాలి లేకపోతే పోరాటం చేస్తాం ఏపీ మత్య్సకార, మత్య్సకార్మిక సంఘం డిమాండ్