ప్రజల శాస్త్రవేత్త డాక్టర్‌ నాయుడమ్మ | - | Sakshi
Sakshi News home page

ప్రజల శాస్త్రవేత్త డాక్టర్‌ నాయుడమ్మ

Jun 23 2025 5:44 AM | Updated on Jun 23 2025 5:44 AM

ప్రజల

ప్రజల శాస్త్రవేత్త డాక్టర్‌ నాయుడమ్మ

తెనాలి: పట్టణానికి చెందిన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్‌ యలవర్తి నాయుడమ్మ 40వ వర్ధంతిని సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. ప్రొఫెసర్‌ వి.బాలమోహన్‌దాస్‌ సెమినార్‌ హాలులో ఉదయం 11 గంటలకు ఏర్పాటయే సభలో డాక్టర్‌ నాయుడమ్మపై రూపొందించిన సావనీరును ఆవిష్కరిస్తారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.గంగాధర్‌రావు, చైన్నెలోని సీఎస్‌ఐఆర్‌–సీఎల్‌ఆర్‌ఐ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ స్వర్ణ వి.కాంత్‌ పాల్గొంటారు. కార్యక్రమాన్ని యలవర్తి నాయుడమ్మ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫౌండేషన్‌ నిర్వహిస్తోంది.

తోలు పరిశ్రమకు సాంకేతిక పరిజ్ఞానం

తోలు శుద్ధి చేసే ప్రక్రియకు సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే పరిశ్రమకు సమస్యగా ఉన్న మకిలి మాయమైంది. కొన్ని వర్గాలకే పరిమితమైన చర్మ పరిశ్రమ అందరిదైంది. చర్మకారుల నైపుణ్యం పెరిగింది. కులాని కతీతంగా చర్మ పరిశ్రమ విస్తరించి, ఆ రంగంలోనూ దేశానికి కీర్తిని తీసుకొచ్చింది. నిశ్శబ్దంగా సాగిన ఈ విప్లవాన్ని సాధించిన ఘనత ప్రజల శాస్త్రవేత్త డాక్టర్‌ యలవర్తి నాయుడమ్మకు దక్కుతుంది. ‘జన్మతః రైతును...వృత్తిరీత్యా అస్పృశ్యుడను’ అని చెప్పుకున్న నాయుడమ్మ, తన వృత్తితో చర్మ పరిశ్రమను ఇతర పరిశ్రమలకు దీటుగా తీర్చిదిద్దారు.

గుంటూరు జిల్లా ముద్దుబిడ్డ

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అమృతలూరు మండల గ్రామం యలవర్రు డాక్టర్‌ నాయుడమ్మ స్వస్థలం. 1922 సెప్టెంబరు 10న జన్మించారు. దగ్గర్లోని తురుమెళ్లలో హైస్కూలు విద్య, గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్‌ తర్వాత, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో కెమికల్‌ టెక్నాలజీలో బీఎస్సీ చేశారు. 1943లో చైన్నెలో లెదర్‌ టెక్నాలజీలో చేరారు. అమెరికాలోని లీహై విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ చర్మశుద్ధిపై ఎంఎస్‌, డాక్టరేట్‌ పొందారు. 1951లో తిరిగొచ్చి, చైన్నెలోని కేంద్ర చర్మ పరిశోధన సంస్థ (సీఎల్‌ఆర్‌ఐ)లో శాస్త్రవేత్తగా చేరారు. ఆ సంస్థను సాటిలేని పరిశోధన సంస్థగా రూపొందించే కృషితో 1958లో అదే సంస్థ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

పరిశోధనలు చర్మకారులకు వరప్రసాదాలు

నాయుడమ్మ పరిశోధనలు దేశీయ చర్మ పరిశోధనకు, చర్మకారులకు వరప్రసాదాలు. ఆయన సారథ్యంలో సీఎల్‌ఆర్‌ఐ సంస్థ, పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణాభివృద్ధిలో గణనీయమైన పాత్ర వహించింది. పలు దేశాలు చర్మ సంపద సద్వినియోగానికి నాయుడమ్మ సలహాలను స్వీకరించాయి. ఐక్యరాజ్య సమితి సలహాదారుగా వివిధ దేశాల్లో తోళ్ల పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడ్డారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ శాస్త్రసాంకేతిక విషయాల శాఖ కార్యదదర్శిగా, భారత విజ్ఞానశాస్త్ర పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా ఏకకాలంలో ఆరుసార్లు పనిచేశారు. సీఎస్‌ఐఆర్‌ డీజీ ఇరత దేశాల్లో ఉన్నతోద్యోగాల్లో ఉన్న భారతీయ శాస్త్ర సాంకేతిక నిపుణులను స్వదేశానికి రప్పించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు.

శాస్త్ర సాంకేతిక కమిటీకి రథసారథి

1980లో అభివృద్ధి చెందిన దేశాల్లోని శాస్త్ర సాంకేతిక కమిటీకి అధ్యక్షులుగా నాయుడమ్మ అనేక సృజనాత్మక పథకాలను ప్రవేశపెట్టారు. ఆసియా ఖండానికి చెందిన అసోసియేషన్‌ ఫర్‌ సైన్స్‌ కో–ఆపరేషన్‌కు వ్యవస్థాపక సభ్యునిగా వ్యవహరించారు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌గా, ఐక్యరాజ్యసమితి సీనియర్‌ సలహాదారుగా, కెనడాలోని అంతర్జాతీయ అభివృద్ధి పరిశోధన కేంద్రం గవర్నర్‌గా, సైన్స్‌ టెక్నాలజీ హైపర్‌ కమిటీ చైర్మన్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గౌరవ సలహాదారుగా పనిచేశారు. చర్మవిజ్ఞానంపై 200 పరిశోధన పత్రాలు, 100 వ్యాసాలను సమర్పించారు. నాయుడమ్మ కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వ పద్మశ్రీ గౌరవం సహా ప్రతిష్టాత్మక రాజాలక్ష్మి ఫౌండేషన్‌ అవార్డును, పలు యూనివర్సిటీల గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. 1985లో జూన్‌ 23న ఆయన ప్రయాణిస్తున్న ఎంపరర్‌ కనిష్క–బోయింగ్‌ 747 విమానం బాంబు పేలుడుకు గురై పేలిపోయింది. దేశం ఒక మహోన్నత శాస్త్రవేత్తను కోల్పోయింది.

దేశంలో తోలు పరిశ్రమ అభివృద్ధికి కృషి నేడు 40వ వర్ధంతిని ఏఎన్‌యూలో నిర్వహిస్తున్న సందర్భంగా నివాళి

ప్రజల శాస్త్రవేత్త డాక్టర్‌ నాయుడమ్మ 1
1/1

ప్రజల శాస్త్రవేత్త డాక్టర్‌ నాయుడమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement