
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
దాచేపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి జరిగింది. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వంగూరు మరియదాసు కుమారుడు యశ్వంత్(18) ఈ దుర్ఘటనలో మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యశ్వంత్ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని నీట్ ప్రవేశ పరీక్ష రాసి ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి అతను ఇద్దరు స్నేహితులతో కలిసి వాహనంపై దాచేపల్లి వచ్చారు. తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో దాచేపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ముందుగా కట్టెల లోడుతో వస్తున్న ఎద్దుల బండిని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో యశ్వంత్ కడుపులోకి కట్టె దిగబడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. యశ్వంత్ని వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం యశ్వంత్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. చదువులో చక్కగా రాణిస్తూ కుటుంబానికి అండగా ఉన్న యశ్వంత్ మృతితో తంగెడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.