
సీఎం పేషీ అక్షింతలతోనే నాయకుల్లో చలనం
పిడుగురాళ్ల: వైఎస్సార్ వైద్యశాల, కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని చేపట్టిన సెల్ఫీ వీడియో ఉద్యమంతో సీఎం పేషీ నుంచి అక్షింతలు పడడంతో స్థానిక నాయకుల్లో చలనం వచ్చిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తాను చేపట్టిన సెల్ఫీ వీడియో ఉద్యమంతో సీఎం కార్యాలయం నుంచి ఆక్షింతలు పడటం వలనే స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వంలో చేపట్టిన వైఎస్సార్ వైద్యశాల, కళాశాలను పరిశీలించినట్లు చెప్పారు. అయితే మెడికల్ కాలేజీ 2019 జనవరి 20న మంజూరు అయిందని శ్రీనివాసరావు చెబుతన్నారని, కనీసం పేపర్ చూసి కూడా చదవలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మొన్నటి వరకు రాయపాటి శ్రీనివాస్ మంజూరు చేయించాడని చెప్పుకొచ్చారని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీ మీద అవగాహన లేకపోవడం హాస్యాస్పదం అన్నారు.
మూడేళ్లలో 70శాతం పనులు
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 మార్చి 2020లో పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నం కేంద్ర ప్రభుత్వం నిధులతో మంజూరు చేసినట్లు వివరించారు. 2020 జనవరిలో కరోనా వచ్చిందని, 2021 కరోనా వలన పనులు చేపట్టలేకపోగా, మిగిలిన మూడేళ్లలోనే మెడికల్ కాలేజీ 60 నుంచి 70 శాతం పనులు పూర్తి చేశామన్నారు. హాస్పటల్ను 90 శాతం పూర్తి చేశామని కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు.
ప్రజల పక్షాన పోరాటం..
ఏది ఏమైనా ప్రతిపక్షమా, పాలకపక్షమా కాకుండా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని కాసు పేర్కొన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలో కప్పం కట్టాలని 40 రోజులు మూసి వేయించింది మీరు కాదా అని ప్రశ్నించారు. చివరికి వైఎస్సార్ సీపీతరఫున మేము ఉద్యమం చేస్తాం అనగానే తెల్లారే ఓపెన్ చేయించారని గుర్తు చేశారు. జానపాడు ఆర్ఓబీని రూ.52 కోట్లతో పనులు మొదలు పెడితే సంవత్సరం నుంచి ఆపివేశారని ఆరోపించారు. తిరిగి మళ్ళీ మేమే ఆర్ఓబీ నిర్మించకపోతే ఉద్యమం చేస్తాం అనగానే వెంటనే నిర్మాణ పనులు మొదలుపెట్టారని పేర్కొన్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ సెల్ఫీలు విడుదల ఉద్యమం చేపట్టడంతో నేడు సీఎం కార్యాలయం నుంచి అక్షింతలు పడటంతో యరపతినేని సందర్శించడం జరిగిందని కాసు మహేష్ రెడ్డి ఆ వీడియోలో వివరించారు.
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి