
సంక్షేమ పథకాలు కోరుతూ ఆందోళన
బాపట్ల: అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులనే పదాన్ని తొలగించి వారికి వేతనాలు పెంపుదల చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రేఖ ఎలిజబెత్, జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీ డిమాండ్ చేశారు. సోమవారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు తల్లి వందనం అమలుచేయకుండా మోసం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు నోరు మెదపకపోవడం వల్ల అంగన్వాడీలకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షులు సీహెచ్.మణిలాల్, ప్రధాన కార్యదర్శి సీహెచ్.మంజూదార్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చిరు కార్మికులు సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపడం లేదన్నారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే గత ప్రభుత్వాలకు పట్టినగతే పడుతుంద న్నారు. అనంతరం జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా నాయకులు కే శరత్, శైలశ్రీ, అనిత, వై.మేరీమణి, బ్యూలా, ఎన్.కృష్ణకుమారి, డి.జ్యోతి, బుచ్చిరాజు పాల్గొన్నారు.
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
బాపట్ల: మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాల అమలు చేయాలని కోరుతూ సోమవారం బాపట్లలోని కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ ధర్నా చేశారు. యూనియన్ జిల్లా కన్వీనర్ వీరాస్వామి మాట్లాడుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంభిసోందని, మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు కావట్లేదన్నారు. కేవలం రూ.12వేల నుంచి రూ.15వేలు మాత్రమే వీరి వేతనాలు ఉన్నాయన్నారు. మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసి జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్లో డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ మజుందార్, కే శరత్, మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల యూనియన్ నాయకులు కోటేశ్వరరావు, ప్రమీల, మురళి, రత్నం, అంకారావు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు కోరుతూ ఆందోళన