
బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి
సచివాలయ ఉద్యోగుల వినతి
నెహ్రూనగర్: బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం.5ను సవరించాలని సచివాలయ ఉద్యోగులు విన్నవించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యాలయంలో అదనపు కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు జరపాలని కోరారు. సొంత మండలాల నిబంధనను తీసివేయాలని, అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సొంత మండలాల ప్రాతిపదికగా కాకుండా అర్బన్ లోకల్ బాడీ(యుఎల్బీ)లోని వార్డును తీసుకోవాలని, గ్రామాల్లో పంచాయతీని ప్రాతిపదికగా తీసుకోవాలని కోరారు. ప్రమోషన్తో పాటు స్పష్టమైన సర్వీస్ రూల్స్ను రూపొందించిన తర్వాతనే బదిలీలు చేపట్టాలని విన్నవించారు. మిగులు ఉద్యోగులను సీనియారిటీ ఆధారంగా వివిధ శాఖల్లోనికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గుంటూరు వార్డు సచివాలయాల అసోసియేషన్ నాయకులు అబ్దుల్ రజాక్, ధనలక్ష్మి, అనురాధ, మధు, రామకృష్ణ, రాజకుమార్ పాల్గొన్నారు.
అండర్–14 టెన్నిస్ విజేత విన్సెంట్
గుంటూరువెస్ట్ (క్రీడలు): గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్, వీవీవీ హెల్త్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులో సోమవారం జరిగిన అండర్–14 టెన్నిస్ పోటీల్లో మిక్స్డ్ సింగిల్స్ విజేతగా కె. విన్సెంట్, రన్నర్గా జి.దిశాంత్ నిలిచారు. డబుల్స్ విభాగంలో దిశ, విన్సెంట్ జోడీ విన్నర్గానూ జి.దిశాంత్, కల్యాణీలు రన్నర్స్గా నిలిచారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విజేతలకు ఆపిల్ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ హనుమంతరావు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వీవీవీ హెల్త్ క్లబ్ డెరెక్టర్ హరికృష్ణ, మధుస్మిత, గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, ఆనంద్ కుమార్, అరుణ్ కుమార్, చరణ్ పాల్గొన్నారు.
‘ఫలక్నుమా’లో ఆరుగురు బాల కార్మికులు గుర్తింపు
రాజుపాలెం: నడికూడి గవర్నమెంట్ రైల్వే పోలీసు, గుంటూరు ఆర్పీఎఫ్, బచపన్ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో గుంటూరు నుంచి పిడుగురాళ్ల వరకు ట్రైన్లో రిస్క్ ఆపరేషన్ నిర్వహించగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు బాలురను గుర్తించి వారి వివరాలను సేకరించారు. వీరిని ఇతర ప్రాంతాలకు బాల కార్మికులుగా పనిచేయించేందుకు తీసుకెళుతున్నట్లు తెలిసింది. వారివారి గ్రామాలకు పంపించే వరకు మండలంలోని కొండమోడు పరిధిలో గల వీరమ్మ కాలనీలోని అనాధ పిల్లల ఆశ్రమం నిర్వాహకులు గరికపాటి శంకరరావుకు ఆదివారం రాత్రి స్థానిక ఎస్ఐ వేణుగోపాల్ సహకారంతో అప్పగించారు. ఈ బాలురు జార్ఖండ్, బిహార్, వెస్ట్ బెంగాల్కు చెందిన వారిగా గుర్తించారు. వారి తల్లిదండ్రులకు అప్పగించే వారకు జాగ్రత్తగా చూసుకోవాలని ఆశ్రమ నిర్వాహకులకు సూచించారు.
తప్పుడు విధానాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
సత్తెనపల్లి: ప్రజలకు సూపరిపాలన అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలను అమలు చేస్తుందనిసీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు దూళ్ళిపాళ్ల రమాదేవి విమర్శించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో రమాదేవి ఆధ్వర్యంలో సీపీఎం బృందం సోమవారం పర్యటించింది. అనంతరం సత్తెనపల్లి పుతుంబాక భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉందన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే పేదలందరికీ రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇచ్చి అక్రమ రవాణా అరికట్టవచ్చునన్నారు. రేషన్ షాపుల వద్దకు వెళ్లి బియ్యం తీసుకోవాలంటే ప్రజలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇంటి వద్దకే రేషన్ బియ్యం వాహనాలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారన్నారు. 1 నుంచి 5 తరగతుల వరకు ఉన్న ఎలిమెంటరీ స్కూల్ నుంచి 3,4,5 తరగతులను విడదీసి దూరంగా ఉన్న హైస్కూల్కు తరలించడంతో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి హామీ కూలీల వేతనాలు 3,4 నెలల పాటు పెండింగ్లో పెడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలు వారి అకౌంట్లో జమ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల మాట్లాడుతూ హిందూ మతాన్ని విమర్శిస్తున్న వారి సంగతి తేలుస్తానని అనడం సరికాదన్నారు. దేవుళ్లను, మతాలను రక్షించడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చారా? లేదా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వచ్చారా? అని ఆమె ప్రశ్నించారు. సీపీఎం పల్నాడు జిల్లా కమిటీ సభ్యురాలు గుంటూరు మల్లేశ్వరి, సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్, పట్టణ కార్యదర్శి డి.విమల తదితరులు పాల్గొన్నారు.

బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి

బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి