
28న తెనాలిలో మానవ హక్కుల పరిరక్షణ సదస్సు
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): తెనాలి పోలీసుల అరాచకత్వాన్ని, మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ తెనాలి పట్టణంలో జూన్ 28న సాయంత్రం 4 గంటలకు మానవ హక్కుల పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో సోమవారం పరిరక్షణ సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ తెనాలి పోలీసులు దళిత మైనారిటీ యువకులపై అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో, బహిరంగ ప్రదేశాల్లో అరికాళ్లపై లాఠీలు విరిగేటట్లుగా అమానుషంగా దాడి చేసిన సంఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన సీఐ రాముల నాయక్, తెనాలి త్రీ టౌన్ సీఐ రమేష్ బాబులతో పాటు కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. దళిత యువకులపై నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని సమర్థించి వత్తాసు పలికిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, దళిత బహుజన ఫ్రంట్, ప్రజాస్వామిక వాదులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో మాల మహానాడు అధ్యక్షుడు తుమ్మల ఫ్రాన్సిస్, కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, రెల్లి సంఘం అధ్యక్షుడు ఎర్రంశెట్టి ప్రసాద్ పాల్గొన్నారు.
– ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు