
27న క్రోసూరులో జాబ్మేళా
క్రోసూరు: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 27న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.వి.రమాదేవి సోమవారం తెలిపారు. ఈ జాబ్డ్రైవ్ను పెదకూరపాడు నియోజకవర్గ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ మేళాలో సుమారు 10 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. జీతం విద్యార్హతను బట్టి సుమారు రూ.12000 – రూ.35,000 ఉంటుందని తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్కు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ చదువుకుని, 18–40 మధ్య వయసు గల నిరుద్యోగ యువతి యువకులు వారి బయోడేటా, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు, పాస్పోర్ట్ ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చునన్నారు. మరిన్ని వివరాలకు 7779858789, 8074393466 నంబర్లలో సంప్రదించాలన్నారు.
రైలు నుంచి జారిపడి ప్రయాణికుడు మృతి
దాచేపల్లి: రైలు నుంచి జారిపడి ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. లింగంపల్లి నుంచి నర్సాపూర్ వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి గుర్తు తెలియని ప్రయాణికుడు జారిపడి మృతి చెందినట్లు రైల్వే జీఆర్పీ పోలీసులు తెలిపారు. నర్సాపూర్ రైలు నడికుడి రైల్వే స్టేషన్కు చేరుకునే సమయంలో జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు రైలు వాకిట్లో కూర్చొని నిద్రపోతూ ప్రమాద వశాత్తూ జారి కిందపడటంతో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతుడి వయస్సు సుమారుగా 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, మృతుడు ఇటుక రంగు పైన ఎరుపు, తెలుపు, నలుపు చెక్స్ బారుచేతుల చొక్కా, బ్లూ రంగు జీన్స్ ప్యాంట్ ధరించాడన్నారు. మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించామని, పూర్తి వివరాలకు నడికుడి రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ వి.శ్రీనివాసరావు నాయక్ తెలిపారు. వివరాలకు 8074274484, 9949063960 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
ఉరివేసుకుని యువకుడి బలవన్మరణం
చిలకలూరిపేట టౌన్: పట్టణంలోని టిడ్కో గృహాల్లో విషాదం చోటు చేసుకుంది. 52 ఎకరాల టిడ్కో గృహాల్లో నివసిస్తున్న యువకుడు దేవగిరి తేజారెడ్డి (28) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకుని తన స్నేహితుడి నివాసంలో జీవితం ముగించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజారెడ్డి పర్చూరు మండలం అన్నవరం గ్రామానికి చెందినవాడు. చిన్నతనంలోనే తల్లి మృతిచెందగా, తండ్రి రెండో వివాహం చేసుకుని వేరుగా నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తేజారెడ్డిని నాయనమ్మ పెంచింది. అయితే కొంతకాలం కిందట ఆమె మృతిచెందడంతో అతను పూర్తిగా ఒంటరివాడయ్యాడు. పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగించిన తేజారెడ్డి మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడల్లా టిడ్కో గృహంలో ఉన్న తన స్నేహితుడి వద్దకు వచ్చి ఒకటి రెండు రోజులు ఉండి వెళ్లిపోతాడు. ఇదే విధంగా ఆదివారం స్నేహితుడి ఇంటికి రావడంతో సాయంత్రం 4 గంటలకు మిత్రుడు పనిమీద బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చి గది తలుపులు తీయగా తేజారెడ్డి ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు, గుంటూరు మండలం అంకిరెడ్డిపాలెంలో ఉంటున్న అమ్మమ్మకు సమాచారం అందించడంతో ఆమె పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అర్బన్ సీఐ పి.రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

27న క్రోసూరులో జాబ్మేళా