‘ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు అధికమయ్యాయి’ | - | Sakshi
Sakshi News home page

‘ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు అధికమయ్యాయి’

Jun 23 2025 5:44 AM | Updated on Jun 23 2025 5:44 AM

‘ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు అధికమయ్యాయి’

‘ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు అధికమయ్యాయి’

గుంటూరు ఎడ్యుకేషన్‌: దేశంలో యాభై ఏళ్ల కిందట నెలకొన్న పరిస్థితులతో పోల్చితే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఇప్పుడే ఎంతో ఉందని పూర్వ విప్లవ విద్యార్థి వేదిక రాష్ట్ర కన్వీనర్‌ భరద్వాజ పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు మెడికల్‌ కళాశాల ఎదుట ఉన్న ఎన్జీవో కల్యాణ మండపంలో యాభై ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానం సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా నవజ్యోతి అధ్యక్షతన జరిగిన సదస్సులో భరద్వాజ మాట్లాడారు. మావోయిస్టులు శాంతి చర్చలకు ముందుకు వచ్చినా కేంద్రం వారిని అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. గతంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో మావోయిస్టులతో చర్చలు జరిపి, వారిని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. ఎల్‌టీటీఈతో పాటు అనేక వేర్పాటువాద ఉద్యమాలు నిర్వహించిన సంస్థలతో సైతం చర్చలు జరిపిన ప్రభుత్వాలు ప్రస్తుతం మావోయిస్టులతో చర్చలకు అంగీకరించేది లేదని చెప్పడం వెనుక కార్పొరేట్‌ సంస్థల ఒత్తిడి కారణమని పేర్కొన్నారు. వీక్షణం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్‌ మాట్లాడుతూ యాభై ఏళ్ల వామపక్ష విద్యార్థి ఉద్యమ ప్రస్థాన యాత్రలో సాధించిన ఎన్నో విజయాలను తెలియజేశారు. ఇప్పటికీ రాడికల్స్‌ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని పేర్కొన్నారు. నేడు ఎందరో త్యాగమూర్తులు అమరులయ్యారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని పూర్వ విద్యార్థి నాయకులుగా మన కర్తవ్యాన్ని నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. విరసం నాయకులు సీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఉద్యమంలో ఒడిదుడుకులు వస్తుంటాయని, అంతమాత్రాన అది ముగిసిపోయినట్లు కాదని, ఉద్యమ వారసత్వ పరంపర కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం నాయకులు వెంకటేశ్వరరావు, డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ ఆర్‌ఎస్‌యూ విజయాల్ని మననం చేసుకున్నారు. మధ్యాహ్నం జరిగిన సెషన్‌కి న్యాయవాది సురేష్‌ అధ్యక్షత వహించారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలుకా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ప్రజలపై యుద్ధం చేస్తోందని విమర్శించారు. ప్రజలకు మద్దతుగా నిలిచిన మావోయిస్టులను, వారితో పాటు అమాయక గిరిజనులను హత్య చేస్తోందని ఆరోపించారు. ప్రజలను అణచివేయడం కోసమే ప్రభుత్వాలు మావోయిస్టులపై దాడి చేస్తున్నాయనే వాస్తవం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. కార్యక్రమంలో విరసం రాష్ట్ర కార్యదర్శి రివేరా, కార్యవర్గ సభ్యుడు పాణి, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన నాట్య మండలి కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు ఆకట్టుకున్నాయి.

పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక

రాష్ట్ర కన్వీనర్‌ భరద్వాజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement