
తెలుగు ప్రాచీనతకు దర్పణం ‘వ్యాస మంజూష’
అద్దంకి: తెలుగు సాహిత్యంలోని ప్రాచీనతను తెలియజేస్తూ దాన్ని నూతన దృక్పథంతో ఆవిష్కరించిన పుస్తకమే ‘వ్యాస మంజూష’ అని సాహితీవేత్త, శాతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం అన్నారు. డీవీఎం సత్యనారాయణ రచించిన ‘వ్యాస మంజూష’ పుస్తక పరిచయ సభ పుట్టంరాజు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. ఈసభా కార్యక్రమానికి సాహితీవేత్త మోటుపల్లి రామదాసు అధ్యక్షత వహించారు. ప్రముఖ సాహితీ విమర్శకుడు నారాయణం బాలసుబ్రహ్మణ్యం ‘వ్యాస మంజూష‘లోని ప్రత్యేకతలను సభకు వివరించారు. గాడేపల్లి దివాకరదత్తు, ఆర్వీ రాఘవరావు, జాగర్లమూడి ప్రతాప్ వంటి సాహితీ ప్రియులు తమ లఘు పరిచయాలతో పుస్తకంలోని విశేషాలను వివరించారు. శ్రీనాథుని కనకాభిషేక విశేషాల నుంచి ‘పాయసమెరుక’ చర్చకు అన్న పద్యం వరకు వీనుల విందుగా చదివి వివరించారు. ఈ గ్రంథంలో శ్రీనాథుని ప్రాచీన కవిత్వాన్ని అత్యంత లోతుగా అధ్యయనం చేసిన రచయిత, శ్రీనాథ–పోతనల సాహితీ బంధాన్ని విశ్లేషించారని సాహితీవేత్తలు ప్రశంసించారు.
రచయిత సత్యనారాయణ కవిత్వం ఆలోచింపజేస్తుంది..
శ్రీనాథుని రచనలలో ప్రత్యక్షమైన ఆంధ్ర వంటకాల ప్రస్తావన, అల్లసాని పెద్దన, మొల్ల, గురజాడ, విశ్వనాథ, త్యాగయ్య, అన్నమయ్య వంటి కవుల విశేషాల గురించి రచయిత చేసిన ప్రయత్నం పాఠకులను ఆకట్టుకునేలా ఉందని సాహితీవేత్తలు కొనియాడారు. డీవీఎం సత్యనారాయణ వాచో విధేయత, నిత్య పరిశీలన, వినయ శీలత, ప్రజాకర్షణ పటిమలు ఆయనను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతిని సాధించే సాహితీశిఖరంగా తీర్చిదిద్దగలవని వక్తలు ప్రశంసించారు. సభ అనంతరం పుట్టంరాజు బుల్లెయ్య–రామలక్ష్మమ్మల ట్రస్టు తరఫున శ్రీరామచంద్రమూర్తి, శైలజ రచయితను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సాహితీ కౌముది అధ్యక్షుడు వారణాసి రఘురామశర్మ, కార్యదర్శి కేవీ పోలిరెడ్డి, కోశాధికారి చుండూరి మురళీసుధాకరరావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, పాటిబండ్ల శ్రీమన్నారాయణ, గోగులమూడి శేషగిరి, ఆర్టిస్టు బాలు, పీసీ హెచ్ కోటయ్య, కే రామమోహనరావు ఎ.యోగయ్య, మలాది శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, మక్కెన వెంకటేశ్వర్లు, వినుకుండ సుధాకర్, అళహరి హరిప్రసాద్బాబు, కందికట్టి సత్యనారాయణ, పెండ్యాల అంకయ్య, కేఎస్ఆర్ కోటేశ్వరరావు, పుట్టంరాజు సాయికుమార్, బాచిన పూర్ణచంద్రరావు, కూరపాటి రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
‘వ్యాస మంజూష’ పుస్తకావిష్కరణ రచయిత సత్యనారాయణకు సత్కారం