
కాలువల మరమ్మతులకు చర్యలు తీసుకోండి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): జిల్లాలో సాగునీటి కాలువలు మురుగునీటి మయమై ప్రజారోగ్యానికి ముప్పుగా మారాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి కె.వి.వి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. పశ్చిమ కృష్ణా డెల్టా ఆయకట్టు సుమారు 5.71 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉందని తెలిపారు. కాలువలు సక్రమంగా లేకపోవడంతో ఆయకట్టు రైతులంతా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి సాగునీటి కాలువల పరిస్థితి నిదర్శనమని విమర్శించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి జమలయ్య ,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి.జగన్నాథం, అధ్యక్షులు కంజుల విఠల్రెడ్డి, నాయకులు పాపారావు, రైతులు పాల్గొన్నారు.
హైవేలపై ప్రమాదాల
నివారణకు ఆధునిక వాహనాలు
ఆర్టీఓ బి.సత్యనారాయణ ప్రసాద్
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): జాతీయ రహదారులపై ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధునిక వాహనాలను ప్రవేశపెట్టినట్లు ఆర్టీఓ బి.సత్యనారాయణ ప్రసాద్ తెలిపారు. గుంటూరులోని కార్యాలయంలో సోమవారం నంది ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగు పెట్రోలింగ్ ఆధునిక వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వాహనాలు 5, 9 నంబర్ల జాతీయ రహదారులపై నిత్యం అందుబాటులో ఉంటాయని చెప్పారు. నంది ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎండీ, విశ్రాంత అడిషనల్ ఎస్పీ కాళహస్తి సత్యనారాయణ పాల్గొన్నారు.
శంకర్ విలాస్ బ్రిడ్జి
నిర్మాణ పనులు ప్రారంభం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ముందుగా బ్రిడ్జి మీదకు బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు రాకుండా డైవర్ట్ చేశారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా లాడ్జి సెంటర్ వద్ద, డొంక రోడ్డు నుంచి కొత్తపేట వైపు వెళ్లేటప్పుడు మలుపుల వద్ద డివైడర్లు ఏర్పాటు చేశారు.
నాట్యంపై రాత పరీక్షలు
ప్రారంభం
కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో మూడు రోజుల పాటు సాగే కూచిపూడి నాట్య సర్టిఫికెట్, డిప్లమో రాత పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు పరిశీలకులుగా హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డి. వెంకట సత్యనారాయణ, ఇన్విజిలేటర్లుగా పసుమర్తి హరినాధశాస్త్రి, ఏలేశ్వరపు శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు. తొలి రోజు పరీక్షకు 37 మంది విద్యార్థులకు 31 మంది హాజరయ్యారని ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ తెలిపారు.

కాలువల మరమ్మతులకు చర్యలు తీసుకోండి

కాలువల మరమ్మతులకు చర్యలు తీసుకోండి

కాలువల మరమ్మతులకు చర్యలు తీసుకోండి