గర్జించిన యువత | - | Sakshi
Sakshi News home page

గర్జించిన యువత

Jun 24 2025 3:41 AM | Updated on Jun 24 2025 3:41 AM

గర్జి

గర్జించిన యువత

వంచనపై
నిరసనలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌
‘‘మేము అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం..ఉద్యోగాలు ఇస్తాం...ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి నెలకు రూ.మూడు వేలు ఇస్తాం’’ అంటూ కూటమి నేతలు ఊరువాడా ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను వంచించారు. కూటమి ప్రభుత్వ వంచనపై యువత పోరుబాట పట్టింది. వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ల వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించినా లెక్క చేయక ముందుకు సాగారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

బాపట్ల: యువత, అంగన్‌వాడీలు, ఇంజినీరింగ్‌ కార్మికుల ఆందోళనలతో సోమవారం బాపట్ల కలెక్టరేట్‌ దద్దరిల్లింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, యువతకు ప్రభుత్వం కల్పిస్తామని చెప్పిన నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలు సక్రమంగా అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోయింది. తమకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలతోపాటు మున్సిపల్‌ కాంట్రాక్టు ఇంజినీరింగ్‌ విభాగం కార్మికులు ధర్నాలు చేపట్టారు. పోలీసులు అనుమతులు ఇవ్వకపోవటంతో ప్‌లై ఓవర్‌ వద్దనే నిరసనలు తెలియజేశారు. కలెక్టరేట్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన వారు సైతం ఇబ్బందులకు గురయ్యారు.

బాపట్ల: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన యువత పోరుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. బాపట్ల పట్టణంలో కదం తొక్కారు. కలెక్టరేట్‌కు వెళ్లే రహదారులన్నీ యువతతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించినప్పటికీ యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ నాయకులు ముందుకు కదిలారు. ప్రదర్శన స్థానిక రథం బజారులోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు సాగింది. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య నాయకత్వంలో వహించారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున, బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు కోన రఘుపతి, వరికూటి అశోక్‌బాబు, ఈవూరి గణేష్‌ ప్రారంభించారు. యువత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్‌కు వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవటంతో ఎట్టకేలకు పదిమంది నాయకులు లోనికి వెళ్లి డీఆర్‌ఓకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, కోకి రాఘవరెడ్డి, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ నక్కా వీరారెడ్డి, సెక్రటరీ దొంతిబోయిన జయభారత్‌రెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, జిల్లా అధికారప్రతినిధి వీరేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాదరెడ్డి, శంకర్‌రెడ్డి, దొంతిబోయిన సీతారామిరెడ్డి, షేక్‌ సయ్యద్‌ పీర్‌, శాయిల మురళి, చల్లా రామయ్య, నియోజకవర్గ అధ్యక్షులు దొంతిబోయిన ఏడుకొండలరెడ్డి, మధు, యువజన విభాగం మండల, పట్టణ అధ్యక్షులు ఊరబండి గోపీనాథ్‌, రవితేజ, సాగర్‌, షేక్‌ మౌలాలి, గోపి, నాయకులు వడ్డిముక్కల డేవిడ్‌, మహ్మద్‌ హుస్సేన్‌, జోగి రాజా, నర్రావుల వెంకట్రావు, మోర్ల సముద్రాల గౌడ్‌, గంగిశెట్టి రత్తయ్య, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపక్షాల గొంతు నొక్కేప్రయత్నం మానుకోవాలి

ప్రతిక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం మానుకోవాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున అన్నారు. నేడు యువత ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే ఇచ్చిన వాగ్దానాలను పెడచెవిన పెట్టి ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందన్నారు. యువతను మోసం చేసిన చంద్రబాబునాయుడు రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించకుండా ఘోరంగా మోసం చేశాడని విమర్శించారు.

ఎన్నికల మేనిఫెస్టోపై నిలదీస్తాం

ఎన్నికల మేనిఫెస్టోపై ప్రతిపక్షంగా మేము నిలదీస్తామని బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి పేర్కొన్నారు. ఎన్నికల ముందుకు ఇచ్చిన సూపర్‌సిక్స్‌ హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్‌ ఇస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ఉన్న పెన్షన్లు తొలగించేందుకు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. స్థానిక నాయకులు సముద్రాన్ని సైతం కబ్జా చేస్తుంటే అధికారులు మౌనంగా ఉండిపోతున్నారని అన్నారు.

వైఫల్యాలను ఎండగడతాం

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవటంతో కళాశాలల యాజమాన్యం హాల్‌ టికెట్లు ఇవ్వడం లేదని రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ఈపూరి గణేష్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కళాశాలలను సైతం పట్టించుకోకపోవటంతో అవి శిథిలావస్థకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మందికి వైద్య పరంగా అవకాశాలను కల్పించే మెడికల్‌ కళాశాలలను పట్టించుకోకపోవటం చూస్తుంటే పేదోడికి వైద్యం అక్కరలేదన్నట్లు ఉందన్నారు. ప్రభుత్వ వైఫలాలను ఎండగట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

అసాంఘిక కార్యక్రమాలకు అనుమతులు

కూటమి ప్రభుత్వం చేపట్టే కోడిపందెలు, పేకాట స్థావరాలకు అనుమతులు ఉంటాయి గానీ, శాంతియుతంగా యువత, నిరుద్యోగులు తమ సమస్యలు చెప్పుకునేందుకు అనుమతులు ఇవ్వకపోవటం బాధాకరమని పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు అన్నారు. పోలీసులు తమ తీరును మార్చుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై గ్రామస్థాయి నుంచి నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ప్రజావ్యతిరేక విధానాలను సహించేదిలేదు

కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను యువత చూస్తూ ఊరుకోదని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య అన్నారు. నిరుద్యోగులు ఉపాధి కోసం ఒక పక్కన ప్రశ్నిస్తుంటే వారిపై అక్రమ కేసులు బనాయించటం సరికాదన్నారు.

యువత పోరుకు విశేష స్పందన

బాపట్లలో నిరుద్యోగుల భారీ ప్రదర్శన జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన యువత అడుగడుగునా పోలీసుల ఆంక్షలు కలెక్టరేట్‌ ఎదుట బైఠాయింపు ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు హోరెత్తిన కలెక్టర్‌ ప్రాంగణం యువతకు అండగా వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం

ఉద్యోగాల కల్పన ఏదీ?

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేరుగ చంద్‌నాగ్‌ మాట్లాడుతూ ఎన్నికలకు ముందుకు చంద్రబాబునాయుడు యువతకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదన్నారు. లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా వివిధ సాకులు చూపి చిరుద్యోగులను తొలగిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఏడాది గడిచినా దాని ఊసేత్తడం లేదని అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు మోపి జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు.

గర్జించిన యువత 1
1/2

గర్జించిన యువత

గర్జించిన యువత 2
2/2

గర్జించిన యువత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement