
నమ్మించి..నట్టేట ముంచి...
యద్దనపూడి: ఆరుగాలం కష్టించి రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొందరు.. ప్రతి నెలా వచ్చే సామాజిక పింఛన్లో కొంత మిగుల్చుకొని మరికొందరు.. తమ పిల్లల భవిష్యత్ కోసం మరికొందరు నెలనెలా పోస్టాఫీసులో పొదుపు చేస్తూ వస్తున్నారు. వారికి చేయూత అందించాల్సిన పోస్టుమాస్టర్లు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు నియోజకవర్గంలో నాగండ్ల, చెరుకూరు, నాగులపాలెం బ్రాంచ్ల్లో వెలుగులోకి రావడం గమనార్హం. తాజాగా యద్దనపూడి మండలం పూనూరు పోస్టాఫీస్లో పోస్టుమాస్టర్ నకిలీ పాస్పుస్తకాలతో ఖాతాదారులను మోసం చేసిన విషయం వెలుగు చూసింది. పూనూరు పోస్టాఫీసులో కల్యాణ్రావు 22 సంవత్సరాలుగా పోస్టుమాస్టర్గా పనిచేస్తున్నాడు. పోస్టాఫీస్కు వచ్చే వారితో బాగా పరిచయాలు పెంచుకున్నాడు. దీంతో సూమారు 1200కు పైగా ఖాతాదారులు పోస్టుమాస్టర్పై నమ్మకంతో నెలనెలా పొదుపు సొమ్ము కడుతూ వస్తున్నారు.
గడువు ముగిసినా నగదు ఇవ్వకపోవడంతో..
గడువు ముగిసినా నగదు ఇవ్వకపోవటంతో కొందరు ఖాతాదారులు చీరాల ఏఎస్పీ శ్రీనివాసరావుకి ఏప్రిల్ నెల15న ఫిర్యాదు చేశారు. 19వ తేదీన తనిఖీకి వచ్చిన శ్రీనివాసరావు విచారణ చేపట్టి జిల్లా ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక ఇచ్చాడు. దీంతో కొందరు ఈ విషయాన్ని విజయవాడలోని పోస్టాఫీస్ ప్రధాన కార్యాలయంలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పోస్టాఫీస్ విజిలెన్స్ అధికారులు మే 22వ తేదీన పూనూరు పోస్టాఫీస్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో పోస్టుమాస్టర్ అవినీతి బండారం బట్టబయలైంది. తప్పుడు నివేదిక ఇచ్చిన చీరాల ఏఎస్పీ శ్రీనివాసరావును హిందుపురం బదిలీ చేశారు. పూనూరు పోస్టుమాస్టర్ను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం విచారణాధికారిగా ఒంగోలు ఏఎస్పీ మధుసూదనరావును వేశారు. కానీ విచారణ మాత్రం నత్తనడకన సాగటంతో ఖాతాదారులు తమ సొమ్ము వస్తుందో రాదోనంటూ భయపడుతున్నారు.
చేతివాటం ప్రదర్శిస్తున్న పోస్టుమాస్టర్లు తాజాగా పూనూరు పోస్టుమాస్టర్ లీలలు నకిలీ పాస్పుస్తకాలతో ఖాతాదారులకు శఠగోపం లబోదిబోమంటున్న ఖాతాదారులు కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
అవకతవకలు వాస్తవమే..
పూనూరు పోస్టాఫీస్లో అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. 1200 మంది ఖాతాదారులు ఉండగా ఇప్పటి వరకు 50 శాతం పుస్తకాలు పరిశీలించాం. పూర్తిస్థాయి విచారణ ముగియగానే ఆధారాలు ఉన్నవారికి తిరిగి వడ్డీతో సహా నగదు చెల్లిస్తాం. చాలా మంది ఆధారాలు లేకుండా డబ్బు ఇచ్చినట్లు ఫోర్జరీ సంతకాలతో నగదు తీసుకున్నాడని చెప్తున్నారని వారిని కూడా పిలిచి ఒక లిస్టు తయారుచేసి న్యాయం జరిగేలా చూస్తాం.
–సాధిక్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ఒంగోలు

నమ్మించి..నట్టేట ముంచి...