
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదరించాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్
గుంటూరులీగల్: క్యాలెండరు యక్టివిటీస్లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు శుక్రవారం రామన్నపేటలోని మానవత స్వచ్ఛంద సేవా సంస్థలో ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవంపై న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వృద్ధులు మనకు జ్ఞానాన్ని, అనుభవాన్ని అందించే వారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో వృద్ధులు ఆర్థికంగా, మానసికంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు జన్మనిచ్చి మన అభివృద్ధి కోసం కృషి చేస్తారని, కొంతమంది వారిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారని చెప్పారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే బహుమతిగా ఇచ్చిన ఆస్తులను రద్దు చేసి తిరిగి వారి సంక్రమిస్తాయనే చట్టం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఆస్తులను ఇచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. నల్సా న్యాయ సేవల పథకం– 2016 ప్రకారం వృద్ధులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. సదస్సులో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, డాక్టర్ ప్రత్యూష, సుబ్బారావు, పెద్దలు పాల్గొన్నారు.