
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి
చీరాల అర్బన్: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. శనివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో సీపీఎం బాపట్ల జిల్లా నాయకులకు రెండు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. మొదటి రోజు వర్తమాన రాజకీయ పరిణామాలుపై మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ప్రారంభమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా సుపరిపాలన అందించినట్లు చెప్పుకుంటుందని, ప్రజలు అటువంటి సంతృప్తి వ్యక్తం చేయడం లేదన్నారు. తల్లికి వందనానికి అనేక నిబంధనలు పెట్టి కోతలు పెట్టారన్నారు. పిల్లల చదువులకు ఇచ్చే డబ్బుల్లో కోత వేయడం సరికాదన్నారు. అర్హులైన అందరికీ తల్లికి వందనం ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. రాష్ట్రానికి వనరులు రాబట్టుకోవడం, విభజన హామీలు అమలుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజలు భావించారన్నారు. ఆచరణలో మాత్రం ఆ ప్రయత్నం జరగలేదన్నారు. సూపర్ సిక్స్ వంటి పథకాలు ఇంటింటికీ అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తోందని తెలిపారు. జిల్లాలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రజల సమస్యలపై జిల్లాలో సీపీఎం పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు టి.కృష్ణమోహన్, ఎన్.బాబూరావు, మణిలాల్, జిల్లా కమిటీ సభ్యులు కొండయ్య, వి.వెంకటరామయ్య, ఎం.ఆంజనేయులు, తిరుమల, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య